logo

భరోసాల తెదేపా... ప్రలోభాల వైకాపా

సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గెలుపే ధ్యేయంగా నాయక గణం ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు.

Published : 01 May 2024 03:08 IST

టంగుటూరులో అభివాదం చేస్తున్న జగన్‌

సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గెలుపే ధ్యేయంగా నాయక గణం ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం జిల్లాలో రెండు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు తమ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని హోరెత్తించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ వేర్వేరు చోట్ల రోడ్‌ షోలు, ముఖాముఖిలో పాల్గొన్నారు. వైకాపా అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి టంగుటూరులో సభ నిర్వహించారు. ఒకే రోజు సాగిన ఈ కార్యక్రమాలు జిల్లాలోని ఆ పార్టీల పరిస్థితిని చెప్పకనే చెప్పాయి. వంద రోజుల్లో రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తామని, సింగిల్‌ నోటిఫికేషన్‌తో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని, ప్రకాశాన్ని ఫార్మా హబ్‌గా మారుస్తామంటూ ఒంగోలు యువగళం సభలో యువతకు నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడుకునేందుకు సమర్థులకు మద్దతుగా నిలవాలని మర్రిపూడిలో నిర్వహించిన రోడ్డు షోలో బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ రెండు కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఆద్యంతం క్రమశిక్షణతో మెలిగారు. అదే సమయంలో టంగుటూరులో వైకాపా అధినేత బహిరంగ సభ మాత్రం పూర్తి భిన్నంగా సాగింది. జిల్లాకు తానేం చేసింది.. చేయనున్నది ప్రస్తావించనే లేదు. పాత విషయాలు, అబద్ధాలు పదేపదే చెబుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసినా సభికుల నుంచి స్పందన కరవైంది. జన సమీకరణకు నేతలు నానా పాట్లు పడాల్సి వచ్చింది. నగదు, మందు, బిర్యానీ పొట్లాలు పంచారు. ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకుని సాధారణ ప్రజలు, ఉద్యోగులు ఇబ్బంది పెట్టారు. సభకు వచ్చి తిరిగి వెళ్తున్న ఆ పార్టీ కార్యకర్తల కార్లలో మద్యం సీసాలను అధికారులే స్వాధీనం చేసుకున్నారు.

ఒంగోలు: తెదేపా అభ్యర్థి దామచర్లతో నారా లోకేశ్‌.. యువగళం సమరభేరి సభకు భారీగా హాజరైన యువత

ప్రచార సభకు హాజరైన వారికి భోజన ప్యాకెట్లు చేతికి అందించకుండా విసిరి వేస్తున్న దృశ్యం

బహిరంగంగా మద్యం తాగుతున్న వైకాపా కార్యకర్తలు

మర్రిపూడి రోడ్‌ షోలో మాట్లాడుతున్న బాలకృష్ణ.. చిత్రంలో తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు స్వామి, మాగుంట, నేత సత్య.. తరలివచ్చిన ప్రజలు, తెదేపా శ్రేణులు

ఈనాడు, ఒంగోలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని