logo

బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం

రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్‌సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు.

Published : 29 Mar 2024 04:35 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్‌సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన రామనాథపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. సాధారణంగా ఏదైనా నియోజకవర్గంలో ముఖ్య నేతలు పోటీచేస్తే వారి పేరుతో పలువురు బరిలో నిలవడం మామూలే. ఒకే ఇంటిపేరు మొదటి అక్షరంతో ఉండటం అరుదు. రామనాథపురంలో ఓ.పన్నీర్‌సెల్వం పేరిట నలుగురు బరిలోకి దిగడం ఓపీఎస్‌ వర్గాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మదురై జిల్లా ఉక్కిలార్పట్టికి చెందిన ఒచ్చప్పన్‌ కుమారుడు పన్నీర్‌సెల్వం, రామనాథపురం జిల్లా కాట్టూర్‌కి చెందిన ఒయ్యారం తనయుడు పన్నీర్‌సెల్వం, మదురై తిరుమంగళానికి చెందిన ఒచ్చాందేవర్‌ కొడుకు పన్నీర్‌సెల్వం, మదురై సోలై అళగుపురానికి చెందిన ఒయ్యాందేవర్‌ కుమారుడు పన్నీర్‌సెల్వం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం నామినేషన్ల పరిశీలనలో అందరి నామపత్రాలు ఆమోదించినట్లు ప్రకటించారు. అక్షరక్రమంలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వం పేర్లు పక్కపక్కనే వస్తాయని, తమ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని ఓపీఎస్‌ మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని