logo

‘పన్నులు వసూలు చేయకపోతే వేతనం నిలిపివేయాలి’

నిర్ణీత గడువులోగా వంద శాతం పన్నులు వసూలు కాకపోతే బాధ్యులైన ఉద్యోగుల వేతనం ఆపాలని ఎమ్మెల్యే ధరంసోతు రెడ్యానాయక్‌ అధికారులను ఆదేశించారు

Published : 29 Jan 2023 06:33 IST

డోర్నకల్‌, న్యూస్‌టుడే: నిర్ణీత గడువులోగా వంద శాతం పన్నులు వసూలు కాకపోతే బాధ్యులైన ఉద్యోగుల వేతనం ఆపాలని ఎమ్మెల్యే ధరంసోతు రెడ్యానాయక్‌ అధికారులను ఆదేశించారు. డోర్నకల్‌లో శనివారం జరిగిన పురపాలిక సాధారణ సమావేశంలో ఆయన విభాగాల వారీగా సమీక్షించారు. పట్టణంలో పన్నుల వసూలు డిమాండ్‌ రూ.78.27 లక్షలు ఉండగా ఇప్పటిదాక రూ.34.38 లక్షలు వసూలు చేసినట్లు తెలుసుకుని మిగతా రూ.43.89 లక్షల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులతో పాటు సిబ్బందికి సూచించారు. పారిశుద్ధ్యం నిర్వహణ తీరును సమీక్షిస్తుండగా హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌ 22 మంది పారిశుద్ధ్య కార్మికుల్లో ఆరుగురు విధులకు సక్రమంగా రాకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వివరించారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ జోక్యం చేసుకుని అలాంటి వారికి మొదట నోటీసు ఇచ్చి సంజాయిషీ కోరాలని, వారిలో మార్పు కనిపించకపోతే తదుపరి చర్యలు తీసుకుందామని బదులిచ్చారు. పట్టణ ప్రగతి పనులకు బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం గురించి పలువురు సభ్యులు కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు పెంపు గురించి డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులపై చర్చించారు. ప్రస్తుతం పురపాలిక పరిధిలో 1722 కుళాయిలున్నాయని, వీటిల్లో అనుమతి లేని వాటిని క్రమబద్దీకరించడంతో అవసరమైన వారికి కొత్త కనెక్షన్లు ఇచ్చి అన్ని ఆవాసాలకు మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. పురపాలిక పరిధిలో వారాంతపు సంత నెలకొల్పడంతో పాటు తడి పొడి చెత్త సేకరణకు రెండు స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేయాలని తీర్మానించారు. డంపింగ్‌ యార్డు లేక ఇబ్బందులు కలుగుతున్నందున స్థల సేకరణ గురించి సభ్యులు చర్చించారు. ఖబ్రస్థాన్‌లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్‌ ఎండీ పర్వీన్‌ సుల్తాన కోరగా పట్టణంలో ఎక్కడెక్కడ వీధి దీపాల అవసరం ఉందనేది గుర్తించాలని ఏఈకు ఎమ్మెల్యే సూచించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ వాంకుడోతు వీరన్న, కమిషనర్‌ కె.శ్రీనివాస్‌రావు, వైస్‌ ఛైర్మన్‌ కేశబోయిన కోటిలింగం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ చిత్రపటానికి పుష్పాభిషేకం

డోర్నకల్‌, న్యూస్‌టుడే: డోర్నకల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ శనివారం పుష్పాభిషేకం చేశారు. డోర్నకల్‌, మరిపెడ పురపాలికలకు రూ.25 కోట్లు చొప్పున రూ.50 కోట్లు, నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేసినందుకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ వాంకుడోతు వీరన్న, వైస్‌ ఛైర్మన్‌ కేశబోయిన కోటిలింగం, భారాస మండలాధ్యక్షుడు నున్నా రమణ, పట్టణాధ్యక్షుడు కత్తెరశాల విద్యాసాగర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ శాఖల పార్టీ బాధ్యులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని