తృణం కాదది ప్రాణం

పేరుకు ‘తృణ’మైనా... పోషకాల విలువలో ఘనమైనవని... మన ఆరోగ్యానికి ప్రాణప్రదమైనవని నిర్ధరిస్తోంది ప్రపంచంలోనే...

Updated : 02 Jan 2021 06:04 IST

రోజుకు 100 గ్రాములతో రోగనిరోధక శక్తి
జీవనశైలి వ్యాధులకు పరిష్కారం
గుప్పెడు గింజలతో గంపెడు ఆరోగ్యం
వంటలే కాదు వీటితో వ్యాపారం నేర్పుతాం... పెట్టుబడి సాయం చేస్తాం
జాతీయ తృణధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌) డైరెక్టర్‌ విలాస్‌ ఎ తొనాపి
బి.ఎన్‌.జ్యోతిప్రసాద్‌
ఈనాడు - హైదరాబాద్‌

తిండి కలిగితే కండ కలదోయ్‌ అన్నారు గురజాడ... కానీ ఎలాంటి తిండి తింటే కండ?
ఎలాంటి భోజనం మనకు అండ?
ఈ ప్రశ్నకు సమాధానాల్లో అన్నింటి కంటే ముందు వరుసలో వినిపిస్తున్నవి... కనిపిస్తున్నవి

- తృణ ధాన్యాలు.

పేరుకు ‘తృణ’మైనా... పోషకాల విలువలో ఘనమైనవని... మన ఆరోగ్యానికి ప్రాణప్రదమైనవని నిర్ధరిస్తోంది ప్రపంచంలోనే అతి పెద్ద చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చి (ఐఐఎంఆర్‌). హైదరాబాద్‌లో ఏర్పాటై... దాదాపు 60 సంవత్సరాలుగా తృణ ధన్యాలతో పాత, కొత్త అనారోగ్యాల్ని కట్టడి చేయటం కోసం ఇతర ప్రముఖ సంస్థలతో కలసి పరిశోధనలు చేస్తోందీ సంస్థ. తృణధాన్యాల ప్రాధాన్యాన్ని ఈ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌. విలాస్‌ కె తొనాపి ‘ఈనాడు’కిచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో వివరించారు.

పాలిష్‌ చేసిన బియ్యం, గోధుమలతో పాటు... పిజ్జాలు, బర్గర్‌ల వంటివీ విరివిగా వినియోగిస్తున్న ఈ కాలంలో కరోనా వచ్చి మన రోగనిరోధక శక్తిని సవాలు చేయటంతో తిండిపై అందరి దృష్టి పడిందిప్పుడు. ఏం తింటే మన ఒంటికి మేలు అనే ఆలోచన మొదలైంది అందరిలోనూ. ‘రోజుకు గుప్పెడు తృణ ధాన్యాలు... మన జీవితాల్నే మార్చేస్తాయి... కావాల్సిన పోషకాలనందిస్తూ... రోగనిరోధక శక్తినీ పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో దోహదం చేస్తాయి... రోజుకు వంద గ్రాములు తీసుకుంటే చాలు... ఆరోగ్యం మీ సొంతం’ అంటోంది జాతీయ తృణధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌). రుచికరమైన ఆహారం సహా జంక్‌ఫుడ్‌ను మరిపించే అనేక వంటకాలను ఈ ధాన్యాలతోనే చేయొచ్చని... అందుకు ముందుకొస్తున్న స్టార్టప్‌లకు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు పెట్టుబడినిచ్చి, సలహాలు, సూచనలిచ్చి మరీ ప్రోత్సహిస్తోంది ఐఐఎంఆర్‌. తృణధాన్యాలు చేసే మేలేంటో, వీటిని ఎలా వ్యాపారంగా కూడా మలచుకోవచ్చో...అందుకు తమ సంస్థ చేసే ఆర్థిక, సాంకేతిక సాయం ఎలాంటిదో ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు ఐఐఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విలాస్‌ ఎ.తొనాపి.

నోటికి రుచి మాటేంటి?
తృణ ధాన్యాలనగానే రుచిపచీ ఉండవనుకోవద్దు... బియ్యం, ఇడ్లీ, దోసె... పులిహోర... సహా వివిధ వంటల్ని రుచికరంగా వీటితోనూ వండొచ్చు. బియ్యం, గోధుమలతో చేసుకునే అన్ని ఆహార పదార్థాలను తృణ ధాన్యాలతో మనం చేసుకోవచ్చు. తృణధాన్యాలతో 65 రకాల ఉత్పత్తులను తయారు చేయొచ్చు. ప్రధాన ఆహారంగానే కాకుండా ప్లేక్స్‌, నూడుల్స్‌, సేమియా సహా అనేక రకాల స్నాక్స్‌ కూడా చేసుకోవచ్చు. 65 రకాల పధార్థాలను ఐఐఎంఆర్‌ కిచెన్‌లో తయారు చేసి 300 ఎంటర్‌ప్రెన్యూర్లకు లైసెన్స్‌ ఇచ్చాం.

మన ఆహారంలో చిరుధాన్యాల ఆవశ్యకతేంటి?
కరోనా విసిరిన సవాలుతో... మనుషుల రోగ నిరోధక సామర్థ్యం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైందిప్పుడు! రోగ నిరోధక సామర్థ్యం అందరికీ ఒకేలా ఉండదు. ప్రజల ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. సాధారణంగా మనం అందుబాటులో ఉన్నవి, తక్కువ ధరకు లభించేవి తింటాం. ప్రస్తుతం మన ఆహార అలవాట్లు బియ్యం, గోధుమ, మొక్కజొన్న మూడు ధాన్యాలతోనే ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా బాగా... ప్రాసెసింగ్‌ చేసిన పదార్థాలను తింటున్నాం. ఆహారధాన్యాలను అత్యధికంగా శుద్ధి చేయడంతో వాటిలోని పీచు, పోషక విలువలను కోల్పోతున్నాం. అందుకే ఇటీవల జీవనశైలి వ్యాధులు పెరగడంతో పాటు మధుమేహం, రక్తపోటు, జీర్ణకోశ క్యాన్సర్లు, ఐబీఎస్‌ (ఇరిటబుల్‌ బౌల్‌ సిండ్రోమ్‌), జీర్ణాశయంలో, పేగుల్లో అల్సర్‌లు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు.... ఇలా అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. వీటికి ప్రధాన కారణం మనం తీసుకుంటున్న ఆహారమే! ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా...రోగాలబారిన పడకుండా మనల్ని కాపాడేవి తృణ ధాన్యాలు. నిజానికి మన దేశానికి ఈ తృణ ధాన్యాలు కొత్తేమీ కాదు. అత్యధిక రాష్ట్రాల్లో- జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఊదలు, సామలు, అరికెలు, వరిగల్లోంచి- ఏదో ఒక తృణధాన్యం మన ఆహారంలో కీలకపాత్ర పోషించేది.

ఇన్ని లాభాలున్నా తృణ ధాన్యాల వినియోగం ఎందుకు తక్కువగా ఉంది?

మనం తెల్ల రంగు ఆహార పదార్థాలపై మక్కువ పెంచుకున్నాం. పాలిష్‌ చేసిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఫలితంగా చిరు ధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గింది. తృణ ధాన్యాలకు డిమాండ్‌ బాగా ఉన్నా తగిన ఉత్పత్తిలేదు. ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ధరలు ఎక్కువగా ఉన్నాయి. సాగును పెంచడానికి కార్యక్రమాలు చేపడుతూ, అనేక కొత్త వంగడాలను తీసుకువచ్చాం. ఉత్పాదకత పెంచే వంగడాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. సరఫరా పెరిగితే ధరలు తగ్గుతాయి. 2023ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచం తృణధాన్యాల ప్రాధాన్యాన్ని ఇప్పుడు గుర్తించింది. అనేక దేశాలు ఈ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

వీటి సాగు పెంచేందుకు ఎలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి?
ప్రపంచంలో తృణధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం మనదే. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెంచడం మనందరి లక్ష్యం కావాలి. నాలుగేళ్లలో 9 నుంచి పది శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. తృణ ధాన్యాల పదార్థాలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐఏ ప్రమాణాలను నిర్దేశించింది. నాణ్యత ఉంటే ఎగుమతులకు అవకాశం ఉంటుంది. వచ్చే రెండు మూడేళ్లలో ప్రతి ఒక్కరి ఆహారపు పళ్లెంలో ఈ ధాన్యం భాగం కావాలి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో వీటి సాగు, వినియోగం ఎక్కువగా ఉంది. యూపీ, పంజాబ్‌ సహా ఇతర రాష్ట్రాల్లో సాగుకు శ్రీకారం చుట్టాం. అన్ని రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేస్తున్నాం. బ్రీడర్‌ సీడ్‌, ఫౌండేషన్‌ సీడ్‌, సర్టిఫైడ్‌ సీడ్‌ను అందుబాటులోకి తెస్తున్నాం.

ఈ తృణ ధాన్యాలతో వంటలెలా చేయాలో నేర్పుతారా?
అవును... తృణ ధాన్యాల ఆహార పదార్థాల తయారీని ఐఐఎంఆర్‌లో నేర్పిస్తున్నాం. అంతేకాదు... ఐఐఎంఆర్‌కు అనుబంధంగా న్యూట్రిహబ్‌ బిజినెస్‌ ఇంక్యూబేటర్‌ను ఏర్పాటు చేశాం. ఇది తృణ ధాన్యాల ఆహార పదార్థాల వ్యాపారంలో ఎందరికో తోడ్పాటును ఇస్తూ  విజయవంతంగా నడుస్తోంది. చిరు ధాన్యాల వినియోగ ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందనే దాని గురించి... ఐఐఎంఆర్‌ పరిశోధిస్తోంది. ప్రధానంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌), వివిధ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, ఎండ్రోకైనాలజిస్టులు... సహా వైద్యనిపుణులతో కలసి పని చేస్తున్నాం. వివిధ రకాల రోగులకు ఇచ్చే ఆహారం, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడంపై పరిశోధనలు, ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. మొదటి వెయ్యి రోజులు పాలిచ్చే తల్లులతో పాటు పసి పిల్లలకు తృణ ధాన్యాల ఆహారం ఎంతో కీలకం. గతంలో పిల్లలకు వివిధ వీటితో తయారు చేసిన గంజి ఇచ్చేవారు. ఇప్పుడు మన మార్కెట్‌లో చిన్నపిల్లల కోసం ఉన్న అనేక పదార్థాలకు తృణ ధాన్యాల గంజి ఏ విధంగానూ తీసిపోదు!

చిరు ప్రయోజనాలెన్నో....!
* జీర్ణశక్తిని పెంచుతాయి.
* రోగనిరోధశక్తిని పెంచుతాయి.
* శ్వాస సమస్యలకు పరిష్కారం చూపుతాయి.
* మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.
* తృణ ధాన్యాల్లోని పదార్థాలు మానసిక ప్రశాంతనిస్తాయి.
* సూక్ష్మ పోషకపదార్థాల సమర్థ శోషణకు దోహద పడతాయి.
* మనం తీసుకునే ఆహారం వేగంగా జీర్ణమైపోతే మనకు చాలా నష్టం. నెమ్మదిగా జీర్ణమైతే పోషకాలను తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
* మన దంతాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. నమలడం అనేది ఎంతో కీలకం... తృణ ధాన్యాలతో ఇది సాధ్యం.
* హరిత విప్లవం...అధునాతన వ్యవసాయ పద్ధతులు ఆహారోత్పత్తిలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు మనం తినడానికి కావాల్సినంత తిండి ఉంది కానీ అది పోషక విలువలు లేనిదని మనం గుర్తించాలి.
* ఆహారపు అలవాట్లపై ఐదారేళ్లుగా ప్రభుత్వాలు, ప్రజలు మేల్కొన్నారనే చెప్పాలి.
* మన సాంప్రదాయ ఆహారమే మనకు మందు. రోగనిరోధక సామర్థ్యం పెంపొందించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.
* ఆహారమే మందు... ఇది మన నినాదం కావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని