12ఏళ్ల తర్వాత ఆ మొక్క మళ్లీ  పూసింది!

నీల్‌కురంజి పుష్పాలు మరోసారి వికసించాయి. సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి పుష్పించే ఈ పువ్వులు తాజాగా మధ్యప్రదేశ్‌లోని పచ్‌మరి ప్రాంతంలో దర్శనమిచ్చాయి. చివరిసారిగా 2006లో కేరళలోని మన్నార్‌ ప్రాంతంలో వికసించిన నీల్‌కురంజి ఈసారి కాస్తా ఆలస్యంగా పుష్పించాయి...

Updated : 19 Sep 2020 13:47 IST

భోపాల్‌: నీల్‌కురంజి పుష్పాలు మరోసారి వికసించాయి. సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి పుష్పించే ఈ పువ్వులు తాజాగా మధ్యప్రదేశ్‌లోని పచ్‌మరి ప్రాంతంలో దర్శనమిచ్చాయి. చివరిసారిగా 2006లో కేరళలోని మన్నార్‌ ప్రాంతంలో వికసించిన నీల్‌కురంజి ఈసారి కాస్తా ఆలస్యంగా పుష్పించాయి. ఈ అందాలను వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పర్యటకులు వస్తుంటారు. కేరళ, మధ్యప్రదేశ్‌లోనే కాకుండా తమిళనాడులోని కొడైకెనాల్‌ తదితర ప్రాంతాల్లోనూ ఈ పుష్పాలు కనిపిస్తుంటాయి.

ఏంటీ నీల్‌కురంజి

ఇది ఓ గడ్డిజాతికి చెందిన పువ్వు. గుబురుగా పెరిగే మొక్క పూలు పూస్తుంది. పేరుకు తగ్గట్టే నీలి రంగులో ఉండే ఈ పువ్వు.. దక్షిణభారత దేశంలోని పశ్చిమ కనుమల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని మొదటిసారిగి 1838 సంవత్సరంలో గుర్తించారు. అప్పటి నుంచి పుష్కరానికోసారి పూస్తున్నట్లు గుర్తించారు. పువ్వులు పూసిన తర్వాత వాటి విత్తనాలు ఆ ప్రాంతమంతా వెదజల్లినట్లుగా విస్తరిస్తాయి. తర్వాత కొన్ని రోజులకు ఆ మొక్కలు చనిపోతాయి. ఆ తర్వాత మళ్లీ 12 ఏళ్లకు ఈ విత్తనాలు మొక్కలుగా మారి పుష్పిస్తాయి. ఈ పువ్వులు పూసిన ప్రాంతమంతా నీలిరంగులో కనువిందు చేస్తుంది.

ఔషధ గుణాలూ ఎక్కువే
ఈ పువ్వుకు అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని పలువురు చెబుతుంటారు. అనేక మొండి వ్యాధులను నయం చేసే శక్తి ఈ పుష్పాలకు ఉంటుందని ఆయుర్వేదంలోనూ ఉందట. అందుకే 12 ఏళ్లపాటు ఓపిగ్గా నిరీక్షించి, ఆ పూలు పూయగానే వాటిని సేకరించి ఔషధాలు తయారు చేస్తారు. సరైన మోతాదులో ఉపయోగిస్తే నీల్‌కురంజి నయం చేయలేని రోగమంటూ లేదని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పుష్పంలో ఏ భాగాన్ని ఉపయోగించాలో తెలిసే గ్రంథాలన్నీ బ్రిటిష్‌ వారి హయాంలో నాశనం అయిపోయాయని చెబుతున్నారు.

ఏకంగా గుడి కట్టారు.
ఇది చాలా అరుదైన పుష్పం కావడం వల్ల దీంతో తయారైన ఔషధాలు అత్యంత ఖరీదైనవి. అప్పట్లోనే దీని ప్రాశస్థ్యాన్ని తెలుసుకున్న ఓ యూరోపియన్‌ మహిళ నీల్‌కురంజి పేరిట ఓ ఆలయాన్ని నిర్మించి, ఆమె కూడా హిందూమతాన్ని స్వీకరించారట. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని