Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 11 Jan 2022 17:31 IST

1. Sputnik-V: హైదరాబాద్‌ చేరుకున్న టీకాలు

రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి కరోనా టీకాలు ఆదివారం భారత్‌కు చేరుకున్నాయి. రెండో విడత కింద 60 వేల టీకా డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఇప్పటికే తొలి విడత కింద 1.50 లక్షల డోసులు మే 1న భారత్‌కు చేరిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా భారత్‌లోని రష్యా రాయబారి నికోలాయ్‌ కుడషేవ్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌పై పోరులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం పటిష్ఠంగా ముందుకు సాగుతోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. Lokdown పట్టని వైనం.. ఇదీ జనం తీరు!

కరోనా కేసుల ఉద్ధృతి దృష్ట్యా తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించినా కొందరు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రాణం మీదికి వస్తున్నా ఖాతరు చేయడం లేదు. ఆదివారం కావడంతో హైదరాబాద్‌ నగరంలోని పలు చేపల మార్కెట్లు, చికెన్‌, మటన్‌ దుకాణాల వద్ద భారీ రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో గుమిగూడంతో పాటు అక్కడికి వచ్చిన వారు కొవిడ్‌ నిబంధనలు ఏమాత్రం పాటించలేదు. భౌతిక దూరం పాటించలేదు సరికదా.. మాస్కులు కూడా సరిగా ధరించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. MP Raghurama: కొన‌సాగుతున్న వైద్య ప‌రీక్ష‌లు

వైకాపా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణకు అయిన గాయాల‌పై జీజీహెచ్‌లో వైద్య‌ ప‌రీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. గుంటూరులోని సీఐడీ కార్యాల‌యంలో త‌న‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కొట్టార‌ని నిన్న ర‌ఘురామ సీఐడీ కోర్టు న్యాయ‌మూర్తి దృష్టికి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు ఇదే విష‌యాన్ని హైకోర్టుకు నివేదించారు. ఈ ఉద‌యం 10.30 లోపు ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన నివేదిక ఇవ్వాల‌ని జిల్లా కోర్టు, మ‌ధ్యాహ్నం 12 గంటలలోపు ఇవ్వాల‌ని హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఆదేశించినా నివేదిక‌లో జాప్యం చోటు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. YS Sharmila: కేసీఆర్‌ సార్‌.. మాట నిలబెట్టుకోండి

‘ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పి ఎనిమిది నెలలు గడిచిపోయింది. ఇంకెప్పుడు చేర్చేది కేసీఆర్‌ సార్‌’ అంటూ వైఎస్‌ షర్మిల ట్విటర్‌ వేదికగా శనివారం ప్రశ్నించారు. ‘చనిపోయేవారు పేదలు కాదనా? లేక పేదల ప్రాణాలు పోయినా ఎవరూ అడిగేవారు ఉండరనే ధైర్యమా? లేక మీ లెక్కకు సరిపడా మరణాలు నమోదు కాలేదనా? కరోనాతో రోడ్ల మీద పడ్డామని, బతుకులు ఆగమైనాయని ఇప్పటికే జనం తిరగపడుతున్నారు. ఇది ఇంకా తీవ్రం కాకముందే స్పందించండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి’ అని ట్వీట్‌ చేశారు.

5. Corona : మూడో రోజూ తగ్గిన కేసులు

భారత్‌లో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య మరోసారి 4 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వరుసగా మూడోరోజు కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 3,11,170 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక అంతక్రితం రోజు మరణాలు 4 వేల లోపు నమోదు కాగా.. తాజాగా 4,077 మంది కొవిడ్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. Coronavaccine: ఆ వైరస్‌పై ప్రభావం స్వల్పం

భారత్‌లో ఉత్పరివర్తనం చెందిన ‘బీ1.617.2’ తరహా కరోనా వైరస్‌ వ్యాపించకుండా టీకాల ప్రభావం ‘చాలా వరకు తక్కువగానే’ ఉంటుందని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ ఆంటోని హార్న్‌డెన్‌ అభిప్రాయపడ్డారు. చెందిన ఈ వైరస్‌ను ‘పట్టించుకోదగ్గ రూపాంతరం’ (వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌- వీఓసీ)గా వ్యవహరిస్తున్నారని, అయితే ఇది టీకాలకు లొంగదని, దీని ద్వారా వ్యాధి తీవ్రత పెరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇలా ఉత్పరివర్తనం చెందిన వైరస్‌పై ఇంకా పరిశోధనలు జరగలేదని కూడా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. GST: కరోనా బాధితులపై జీఎస్టీ భారం

అసలే కష్టకాలం.. కరోనా మహమ్మారి దెబ్బకు కోట్లాది కుటుంబాలు కకావికలమవుతున్న కాలం..ఇలాంటి ఆపత్కకర సమయంలోనూ కరోనా బాధితులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మోత మోగుతూనే ఉంది.  కొవిడ్‌ రోగులకు ఉపయోగపడేవి, చికిత్సలో వాడే మందులు, పరికరాలు అన్నింటిపైనా 6 నుంచి 18 శాతం దాకా జీఎస్టీ భారం పడుతోంది. కరోనాతో ఆస్పత్రుల్లో చేరిన వారికి వైద్యంతో పాటు జీఎస్టీ రూపేణా పడే భారం అదనంగా 15 శాతం దాకా ఉంటోంది పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. స్టేడియాన్ని టీకా కేంద్రంగా ఉపయోగించుకోండి

దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియాన్ని కొవిడ్ 19 టీకా కేంద్రంగా ఉపయోగించుకోవాలని దిల్లీ డిస్ట్రిక్స్‌  క్రికెట్ అసోసియేషన్‌ (డీడీసీఏ) ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ  ప్రభుత్వానికి లేఖ రాసినట్లు డీడీసీఏ బోర్డు అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఆగని పెట్రో మోత!

దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది. ఒకరోజు విరామం తర్వాత చమురు ధరలను పెంచుతూ ఆదివారం విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్​పై 24పైసలు, లీటరు డీజిల్​పై 27పైసలను పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్​ ధర లీటరుకు రూ. 92.58, డీజిల్​ ధర రూ. 83.22కు చేరాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.22, డీజిల్ రూ.90.73గా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. Karnataka నుంచి బైడెన్, కమలకు మాస్కులు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కర్ణాటకలోని దావణగెరెకు చెందిన వివేకానంద అనే వ్యక్తి మాస్కులు పంపించారు. తనే స్వయంగా మాస్కులకు తయారు చేశారు. మూడు పొరలున్న ఈ మాస్కులు అమెరికా చేరుకున్నాయి. గతేడాది నుంచి వివేకానంద మాస్కులు తయారు చేయడం మొదలు పెట్టారు. భార్య శాంతా, కూతురు కావ్య ఆయనకు సాయం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని