TS High court: వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు  మంగళవారానికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం 4 గంటలకు అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవాలని సీబీఐకి సూచించింది.

Updated : 20 Apr 2023 11:03 IST

హైదరాబాద్‌: మాజీ ఎంపీ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణను ముమ్మరం చేసిన నేపథ్యంలో..  కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అదుపులోకి తీసుకుంటారన్న అవినాష్ వ్యాఖ్యలపై న్యాయమూర్తి సీబీఐ స్పందన కోరారు. అది నిజమేనని, ఆయన్ను అదుపులోకి తీసుకుంటామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవినాష్‌ రెడ్డిని మంగళవారం సాయంత్రం విచారణకు పిలవాలని సీబీఐకి హైకోర్టు సూచించింది. దీనికి అంగీకరించిన సీబీఐ.. సాయంత్రం 4 గంటలకు విచారిస్తామని తెలిపింది. దీంతో అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. మంగళవారం ఉదయం 10.30కి విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసు ఇచ్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో 4 సార్లు అరెస్టు చేయలేదు కదా.. ఇప్పుడు ఆందోళన ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం ఆయన తండ్రి  భాస్కరరెడ్డి అరెస్టు చేసిన నేపథ్యంలో అవినాష్‌ ఆందోళన చెందుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా అరెస్టు చేసే అవకాశం ఉందని సీబీఐ న్యాయవాది కూడా చెబుతున్నారన్నారు.

మరోవైపు ఈ నెల 30నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించిందని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవినాష్ రెడ్డి విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అవసరమైన తదుపరి చర్యలు కూడా తీసుకుంటామన్నారు. హత్య జరిగిన తర్వాత అవినాష్ సమక్షంలోనే సాక్ష్యాలు చెరిపేశారని సీబీఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. కేవలం దస్తగిరి వాంగ్మూలంపైనే ఆధారపడటం లేదన్నారు. సీఆర్‌పీసీ 160 నోటీసులు ఇచ్చినా ఆధారాలను బట్టి అరెస్టులు చేయవచ్చని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం మంగళవారం సాయంత్రం అవినాష్‌ రెడ్డిని విచారణకు పిలవాలని సూచించింది. అనంతరం కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని