
Ap News: ప్రభుత్వంతో చర్చల్లేవ్... 21న సమ్మె నోటీసు ఇస్తాం: బండి శ్రీనివాసులు
అమరావతి: పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను బేషరతుగా రద్దు చేయాలని ఏపీ ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఎన్జీవో కార్యాలయం వద్ద పీఆర్సీ జీవోలను దహనం చేశారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ఎన్జీవో కార్యవర్గ సమావేశంలో 11వ పీఆర్సీకి సబంధించి అన్ని విషయాలు చర్చించినట్టు చెప్పారు. కొత్త పీఆర్సీ ప్రకారం... ప్రతి ఒక్క ఉద్యోగికి రూ.6 నుంచి 7వేల వరకు జేబుకు చిల్లు పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొత్త పీఆర్సీ వద్దు.. డీఏలతో కూడిన 27శాతం ఐఆర్ ఇస్తున్న పాత జీతమే ముద్దు’ అని కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్టు చెప్పారు. ప్రభుత్వం తమను మోసం చేసిందని, ఉద్యోగులు తమ భవిష్యత్తును తాకట్టుపెట్టేందుకు సిద్ధంగా లేరన్నారు. పీఆర్స్పై సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయని, 21న సీఎస్కు సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగుల ఆశలను వమ్ము చేయమని స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు ఉండవని బండి శ్రీనివాసులు వెల్లడించారు.