Cm Jagan: అంగన్వాడీల నిర్వహణకు ప్రత్యేక నిధి.. సమీక్షలో సీఎం జగన్
రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్ చేసిన బియ్యాన్నే పంపిణీ
అమరావతి: రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్ చేసిన బియ్యాన్నే పంపిణీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని.. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. అంగన్వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
‘‘అంగన్వాడీ పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలి. పంపిణీలో అక్కడక్కడా లోపాలు తలెత్తుతున్నాయని సమాచారం ఉంది. నివారణకు పకడ్బందీ విధానాలు అమలు చేయాలి. నాణ్యతను పూర్తిస్థాయిలో చెక్ చేసిన తర్వాతే పిల్లలకు చేరాలి. అంగన్వాడీల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబర్తో ఉన్న పోస్టర్ను ప్రతి అంగన్వాడీ కేంద్రం వద్ద ఉంచాలి. సెప్టెంబరు 30 కల్లా అంగన్వాడీ సూపర్ వైజర్ల పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలి. అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలి. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తాం. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అవసరమనుకుంటే.. తమ ఆన్సర్షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం కల్పిస్తాం. పరీక్షల ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబరు 30 కల్లా సూపర్వైజర్లను నియమించేలా చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.