CM KCR: ఆ క్యాన్సర్‌ మనదగ్గర తెచ్చుకోవద్దు: సీఎం కేసీఆర్‌

అన్ని మతాలు, కులాలను ఆదరించే దేశం మనదని.. కొందరు మాత్రం కులం, మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని

Updated : 26 Apr 2022 15:37 IST

హైదరాబాద్‌: అన్ని మతాలు, కులాలను ఆదరించే దేశం మనదని.. కొందరు మాత్రం కులం, మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. అది క్యాన్సర్‌ జబ్బులాంటిదని.. ఒకసారి వస్తే చాలా ప్రమాదకరమని చెప్పారు. అన్ని కులాలు, మతాలను ఆదరించే పరిస్థితిని చెడగొడితే ఎటూ కాకుండా పోతామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరిధిలో మూడు టిమ్స్‌ ఆస్పత్రులకు కేసీఆర్‌ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. 

పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి వైద్యం

‘‘మిగతా పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలు జరుపుతున్నాయి. మనం మాత్రం ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నాం. ఇదే వాళ్లకీ మనకీ తేడా. రాష్ట్రంలో వైద్యవిధానాన్ని పటిష్ఠం చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. టిమ్స్‌ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుతుంది. 16 స్పెషాలిటీ, 15 సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. అల్వాల్‌ టిమ్స్‌లో ప్రసూతి సేవల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. కరోనాలాంటి వైరస్‌లు భవిష్యత్‌లోనూ వచ్చే ప్రమాదముంది. హైదరాబాద్‌ నగరంపై ఒత్తిడి పెరుగుతున్నందున ఎయిమ్స్‌ తరహాలో టిమ్స్‌ ఆస్పత్రులను తీసుకొస్తున్నాం. కేవలం గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌పైనే ఆధారపడకుండా నగరానికి నలువైపులా వీటిని ఏర్పాటు చేస్తున్నాం.

అలా అయితే పెట్టుబడులు వస్తాయా?

కులమతాల పేరుతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు గమనించాలి. మన దేశానికి చెందిన సుమారు 13కోట్ల మంది విదేశాల్లో పనిచేస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు వాళ్లని వెనక్కి పంపితే వారికి ఉద్యోగాలు ఎవరివ్వాలి?ఈ ఏడేళ్లలో హైదరాబాద్‌లో 2.30లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. 10 నుంచి 15లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగాయి. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో 14వేల ఎకరాల్లో ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రపంచానికే వ్యాక్సిన్ల రాజధానిగా హైదరాబాద్‌. జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్‌ సంస్థలు ఉన్నాయి. దేశవిదేశాల వాళ్లు ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా? మతం, కులం పేరుతో కొట్లాటలు, కర్ఫ్యూలు ఉంటే పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారు. అలాంటి క్యాన్సర్‌ మన దగ్గర తెచ్చుకోవద్దు. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. తాత్కాలికంగా అవి గమ్మత్తుగా అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఆస్కారం ఇవ్వొద్దు. 

ఇండియాలో కరెంట్ ఉంటే వార్త.. తెలంగాణలో కరెంట్ పోతే వార్త!

మనది పసికూన రాష్ట్రమైనా అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. గుజరాత్‌, మహారాష్ట్ర తదితర పెద్ద రాష్ట్రాల కంటే మన తలసరి ఆదాయం ఎక్కువ. తెలంగాణ తరహా పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవు. ఇండియాలో కరెంట్ ఉంటే వార్త.. తెలంగాణలో కరెంట్‌ పోతే వార్త. గుజరాత్‌లో రైతులు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నాం. మిషన్‌ భగీరథతో మంచినీటి కొరత తీర్చుకున్నాం. సాగునీటి రంగంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. వైద్యం, విద్యపై రాబోయే రోజుల్లో దృష్టి పెట్టబోతున్నాం. ప్రజల మద్దతుతోనే ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజల దీవెన ఇదేవిధంగా కొనసాగాలి.. తెలంగాణ మరింత పచ్చబడాలి. దుష్టశక్తుల బారి నుంచి ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని ముందుకెళ్తాం’’ అని కేసీఆర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని