ఈ కొత్త పరీక్షకు..కొవిడ్‌ జాడ చిక్కాల్సిందే!

కరోనా సోకినా... కొన్నిసార్లు పరీక్షల్లో చిక్కడం లేదు. అయితే... పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌), యాంటీబాడీ టెస్ట్‌లను మేళవించడం ద్వారా కరోనా జాడను మరింత సమర్థవంతంగా.

Updated : 05 Sep 2020 07:19 IST

లండన్‌: కరోనా సోకినా... కొన్నిసార్లు పరీక్షల్లో చిక్కడం లేదు. అయితే... పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌), యాంటీబాడీ టెస్ట్‌లను మేళవించడం ద్వారా కరోనా జాడను మరింత సమర్థవంతంగా కనుగొనవచ్చని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. వర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. వైద్య సిబ్బంది ప్రస్తుతం ముక్కు, నోటి నుంచి స్వాబ్‌ సేకరించి, పీసీఆర్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. వైరస్‌ అక్కడి నుంచి జారుకుని శరీరంలోని అవయవాలకు చేరుకోవడం వల్ల... కొందరిలో ‘నెగెటివ్‌’ ఫలితం వస్తోంది. మరోవైపు- వైరస్‌ సోకి కనీసం ఆరు రోజులు గడిస్తేగాని యాంటీబాడీ పరీక్షలో ఆ విషయం తెలియదు. ‘కేంబ్రిడ్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ థెరపిటిక్‌ ఇమ్యునాలజీ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజ్‌’కు చెందిన ప్రొఫెసర్‌ రవి గుప్త బృందం... ఈ రెండు పరీక్షలను మేళవించి, సరికొత్త ‘ఎస్‌ఏఎంబీఏ-2’ విధానాన్ని రూపొందించింది. వైరస్‌ సోకిందా? లేదా? అన్న విషయాన్ని ‘గోల్డ్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌’గా చెబుతున్న ఈ పరీక్ష మరింత కచ్చితంగా నిర్ధారిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్‌ ఆసుపత్రిలో 45 మందికి ఈ టెస్ట్‌ చేయగా, 24 మందికి పాజిటివ్‌ ఉన్నట్టు తేలింది. ‘సెల్‌ రిపోర్ట్‌ మెడిసిన్‌’ పత్రిక ఈ వివరాలు అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని