Viral news: మద్యం మత్తులో ఎద్దుపై సవారీ.. ఆపై ఏం జరిగిందంటే?

మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన పని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, అతడు తన చర్యలతో రోడ్డుపై వెళుతున్న వారికి ఇబ్బందులకు గురిచేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Published : 10 May 2023 01:39 IST

డెహ్రాడూన్‌: మద్యం మత్తు తలకెక్కితే చాలా మంది ఏం చేస్తున్నామనే విషయం మర్చిపోయి తమతో పాటు ఇతరులకూ ఇబ్బంది కలిగిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటారు. తాజాగా ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో ఓ యువకుడు మద్యం మత్తులో చేసిన పని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రిషికేష్‌(Rishikesh)కు చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఎద్దు (Bull)పై సవారీ చేస్తూ తపోవన్‌ ప్రాంతంలో వీధుల్లో హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన మొత్తాన్ని రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు. యువకుడు అలా ఎద్దుపై స్వారీ చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న వారు ఒకింత భయాందోళనకు గురయ్యారు. 

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఉత్తరాఖండ్‌ పోలీసులు స్పందించారు. వీడియోను ఉత్తరాఖండ్‌ పోలీస్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ‘‘ మే 5న అర్థరాత్రి సమయంలో రిషికేశ్‌ తపోవన్‌ ప్రాంతంలో ఓ యువకుడు ఎద్దుపై స్వారీ చేస్తున్న వీడియో మా దృష్టికి వచ్చింది. వీడియో ఆధారంగా యువకుణ్ని అదుపులోకి తీసుకున్నాం. యువత ఎవరు జంతువులను హింసించవద్దని సూచిస్తున్నాం’’ అని ట్వీట్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు జంతువులను హింసించడం సరికాదని కామెంట్ చేయగా, మరికొందరు అతను ఎద్దుపై సవారీ బాగా చేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని