స్టాంపులు అంటించేందుకు అది వాడొద్దు

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం రాజధానిలోని ఓ న్యాయస్థానం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 19 May 2020 13:25 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ కట్టడి కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని ఓ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో స్టాంపులు మొదలైన వాటిని అంటించేందుకు లాలాజలం వాడటాన్ని నిషేధించింది.

దరఖాస్తులు, విజ్ఞాపనలపై కోర్టు ఫీజు స్టాంపులను అంటించేందుకు... సమన్లు, నోటీసులు తదితరాలు ఉంచే కవర్లను అంటించేందుకు ఉమ్మిని వాడరాదని దిల్లీలోని తీస్‌ హజారీ న్యాయస్థానం పేర్కొంది. డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ న్యాయమూర్తి గిరీష్‌ కథ్‌పాలియా ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. కోర్టు పరిసరాల్లో కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులందరికీ వర్తిస్తుందని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆఫీసు కార్యకలాపాలలో భాగంగా ఫైళ్లు, రిజిస్టర్లు మొదలైన వాటికి సంబంధించిన కాగితాలను తిరగేసేందుకు కూడా ఉమ్మిని వాడటం నిషేధించారు. లాలాజలానికి బదులుగా ప్లాస్టిక్‌ స్పాంజి ఉండే డంపర్‌ ప్యాడ్‌ను వాడాల్సిందిగా ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని