దేశంలో 62లక్షల కరోనా శాంపిళ్ల పరీక్ష!

దేశంలో ఇప్పటివరకు 62లక్షల కొవిడ్‌-19 శాంపిళ్లకు పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. గడచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న లేబొరేటరీల్లో 1,65,412 పరీక్షలు చేసినట్లు తెలిపింది.

Published : 18 Jun 2020 18:14 IST

దిల్లీ: దేశంలో ఇప్పటివరకు 62,49,668 శాంపిళ్లకు కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. గడచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న లేబొరేటరీల్లో 1,65,412 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఒకరోజు గడువులో ఇన్ని పరీక్షలు ఇదే తొలిసారి అని ఐసీఎంఆర్‌ పేర్కొంది. దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 పరీక్షలు చేసేందుకు ఇప్పటివరకు 953 లేబొరేటరీలకు అనుమతి ఇచ్చింది. వీటిలో 699 ల్యాబ్‌లు ప్రభుత్వ ఆధీనంలోవి కాగా మరో 254ల్యాబ్‌లు ప్రైవేటుకు చెందినవి ఉన్నాయి.

ఇదిలా ఉంటే, ప్రపంచంలో అత్యధికంగా అమెరికా కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు జరుపుతోంది. ఇప్పటివరకు 2కోట్ల 60లక్షల శాంపిళ్లకు కరోనా టెస్ట్‌లు నిర్వహించినట్లు సమాచారం. ఇక అమెరికా తరువాత రష్యా అధిక స్థాయిలో కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు దాదాపు కోటి 56లక్షల శాంపిళ్లను పరీక్షించారు. ఇక కరోనా వైరస్‌కు పుట్టినిల్లు చైనాలో భారీగానే కొవిడ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నప్పటికీ వాటికి సబంధించిన స్పష్టమైన సమాచారం ఎక్కడా ఇవ్వడం లేదు. అంతర్జాతీయ మీడియా ప్రకారం, దాదాపు కోటి జనాభా కలిగిన వుహాన్‌ నగరంలోనే 90లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు సమాచారం. బీజింగ్‌లో కూడా భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని