బిర్యానీలో మసాలా లేదు.. లెగ్పీస్ రాలేదు!
ట్విటర్ వేదికగా ప్రజల సమస్యలపై స్పందిస్తూ, వాటిని పరిష్కరించడంతోపాటు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న మంత్రి కేటీ రామారావుకు శుక్రవారం ట్విటర్లో తోటకూర రఘుపతి అనే వ్యక్తి నుంచి వింత ఫిర్యాదు వచ్చింది.
కేటీఆర్కు నెటిజన్ వింత ఫిర్యాదు
మంత్రి విస్మయం
ఈనాడు, హైదరాబాద్: ట్విటర్ వేదికగా ప్రజల సమస్యలపై స్పందిస్తూ, వాటిని పరిష్కరించడంతోపాటు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న మంత్రి కేటీ రామారావుకు శుక్రవారం ట్విటర్లో తోటకూర రఘుపతి అనే వ్యక్తి నుంచి వింత ఫిర్యాదు వచ్చింది. ‘‘కేటీఆర్ గారూ! నేను ఆన్లైన్లో చికెన్ బిర్యాని ఆర్డర్ చేశాను. అదనపు మసాలాతోపాటు లెగ్పీస్ పంపాలని కోరారు. అవేమీ రాలేదు. కావాలంటే ఈ ఫోటో చూడండి. ప్రజలకు ఇలాగేనా సేవలందించడం’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మంత్రి విస్మయం చెందారు. ‘‘ఈ విషయంలో నేనేం చేయగలను బ్రదర్. నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు’’ అని ప్రశ్నించారు. తర్వాత ఆ ట్వీట్ను కేటీఆర్ తొలగించారు.
ఆ బాలుడికి కళ్లు తెప్పిస్తాం
ఒక నెజిజన్ హైదరాబాద్కు చెందిన ఐదేళ్ల బాలుడికి రూ.1.5 లక్షలతో కంటి శస్త్రచికిత్స చేయించాలని ట్విటర్లో అభ్యర్థించారు. స్పందించిన కేటీఆర్ ఆ ఖర్చును తామే భరించి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు.
శస్త్రచికిత్స చేయించరూ..
రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన పేద గిరిజనుడు ధరమ్సోత్ సీతారామ్ నాయక్ను ఆదుకోవాలంటూ ఒక నెటిజన్ కేటీఆర్ను కోరారు. శస్త్రచికిత్సకు రూ.15 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారని, అంత ఖర్చు భరించే స్థితిలో ఆ కుటుంబం లేదన్నారు. స్పందించిన మంత్రి అతడిని ఆదుకుంటానని హామీ ఇవ్వడంతోపాటు చికిత్సకు ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.