AP News: చాకులతో కాదు బ్రో.. కత్తులతో కోద్దాం!

వైకాపా నాయకుడి కుమారుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు.

Published : 17 Jun 2021 08:10 IST

కేకులు కోస్తూ యువత వీరంగం 

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: వైకాపా నాయకుడి కుమారుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాజీ కౌన్సిలర్‌ తనయుడు యల్లమిల్లి దుర్గాప్రసాద్‌ పుట్టినరోజు సందర్భంగా స్థానిక విష్ణ్వాలయం సెంటర్‌లో మంగళవారం రాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. కొంతమంది యువకులు కత్తులు తెచ్చి తమ నాయకుడు దుర్గాప్రసాద్‌ చేతికిచ్చి వాటితో కేకు కోయించారు. అనంతరం పెద్దఎత్తున కేకలు వేస్తూ ద్విచక్ర వాహనాలపై కత్తులు తిప్పుతూ ర్యాలీగా వెళ్లారు. పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఓ కారుపై మరో కేకును ఉంచి కత్తితో కోసి వేడుకలు చేసుకున్నారు. మళ్లీ ర్యాలీగా విష్ణ్వాలయం సెంటర్‌కు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై కె.సురేష్‌కుమార్‌ అక్కడకు వెళ్లి వారిని చెదరగొట్టారు. కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో పోలీస్‌స్టేషన్‌ ఎదుటే పుట్టినరోజు వేడుకల పేరుతో యువకులు హల్‌చల్‌ చేయడం విమర్శలకు దారితీసింది. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి, ముమ్మిడివరం సీఐ జానకిరాం, ఎస్సై సురేష్‌బాబు బుధవారం దీనిపై విచారణ చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని