HMDA: నియో పోలిస్‌ ఫేజ్‌-2 భూముల వేలం.. రికార్డు స్థాయిలో ఎకరం ధర రూ.100 కోట్లు

హెచ్‌ఎండీఏ కోకాపేట- నియోపోలిస్‌ ఫేజ్‌-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్‌ చరిత్రలో అత్యధికంగా ఎకరం రూ.100 కోట్ల ధర పలికింది.

Updated : 03 Aug 2023 22:12 IST

హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ కోకాపేట- నియోపోలిస్‌ ఫేజ్‌-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్‌ చరిత్రలో అత్యధికంగా ఎకరం రూ.100 కోట్ల ధర పలికింది. రికార్డు స్థాయిలో ధర పలకడం మార్కెట్‌ వర్గాల్లో సంచలనంగా మారింది. కోకాపేట ఫేజ్‌-2 భూముల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.3,319.60 కోట్ల ఆదాయం సమకూరింది. నియో పోలిస్‌లో హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధరను నిర్ణయించింది. ఈ- వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ.100.75 కోట్లు.. అత్యల్పంగా రూ.67.25 కోట్లు పలికింది. నియో పోలిస్‌ ఫేజ్‌-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గురువారం ఉదయం  26.86 ఎకరాలకు వేలం పూర్తయింది.

సాయంత్రం నుంచి  10, 11, 14  నెంబరు ప్లాట్లకు (18.47 ఎకరాలకు) వేలం నిర్వహించారు. పదో నెంబరు ప్లాట్‌ అత్యధికంగా రూ.100.75 కోట్ల ధర పలికింది. 3.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాటును ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ రాజపుష్ప రూ.100.75 కోట్లకు దక్కించుకుంది. హైదరాబాద్‌ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 7.53 ఎకరాల విస్తీర్ణంలో 11వ ప్లాట్‌లో ఎకరం ధర అత్యల్పంగా రూ.67.25 కోట్లు ధర పలికింది.  స్థిరాస్తి దిగ్గజ సంస్థల మధ్య నెలకొన్న పోటీతో ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయం సమకూరింది. షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీ, మైహోం, రాజ్‌పుష్పా తదితర ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థలు కోకాపేట భూముల ఈ వేలంలో పాల్గొన్నట్టు సమాచారం. 

కోకాపేటలో నియోపొలిస్‌ పేరుతో హెచ్‌ఎండీఏ 500 ఎకరాల్లో లేఅవుట్‌ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.450 కోట్లతో రహదారులతోపాటు తాగునీరు, మురుగు నీటి వ్యవస్థ, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం ఇతర అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. ఇప్పటికే తొలి విడత వేలంలో కొంత భూమిని విక్రయించగా రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా ఎకరా రూ.60 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. అదే ఉత్సాహంతో మిగిలిన 45.33 ఎకరాలకు గురువారం  ఈ-వేలం నిర్వహించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని