మోదీజీ! మాకెంతో పని ఉంటోంది.. ఆరేళ్ల బాలిక విన్నపం
గంటల కొద్దీ ఆన్లైన్ క్లాసులు వినడం.. జమ్మూ కశ్మీర్లోని ఓ ఆరేళ్ల బాలికకు నచ్చలేదు. ఈ సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది ఆ చిన్నారి
దిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచం స్తంభించిపోయి కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితయ్యారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఇబ్బందులకు గురవుతున్నారు. దేశంలోని లక్షల మంది విద్యార్థులు ఇళ్లల్లోనే ఉండి ఆన్లైన్ తరగతులు వింటున్నారు. అయితే గంటల కొద్దీ ఆన్లైన్ క్లాసులు వినడం.. జమ్మూ కశ్మీర్లోని ఓ ఆరేళ్ల బాలికకు నచ్చలేదు. ఈ సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది ఆ చిన్నారి. ఓ వీడియో ద్వారా మోదీకి తన పరిస్థితిని, తనలాంటి మరెంతోమంది పిల్లల దుస్థితి గురించి విన్నవించింది.
45 సెకన్ల వీడియోలో సదరు బాలిక మాట్లాడుతూ.. ‘ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంగ్లిష్, గణితం, ఉర్దూ, ఈవీఎస్, కంప్యూటర్ తరగతులు నిర్వహిస్తున్నారు. పిల్లలకు ఎంతో పని ఉంటోంది. ఇంత పని పెద్ద వాళ్లకు.. అంటే ఆరు, ఏడు తరగతుల వాళ్లకు ఉండాలి. నాలాంటి చిన్నవాళ్లకు ఇంత ఎక్కువ పని ఎందుకు మోదీ సాబ్.. ఇప్పుడేం చెయ్యాలి.. ఉంటాను మోదీ సాబ్’ అంటూ ఆ చిన్నారి పలికిన హావభావాలు, చేతుల కదలికలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
అనురంగ్జేబ్ నక్ష్బందీ అనే జర్నలిస్ట్ పోస్టు చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇప్పటికే ఆ వీడియోను 80 వేల మందికి పైగా వీక్షించారు. వందలాది నెటిజన్లు రీ ట్వీట్లు చేశారు. ఇది ఒక్కరి సమస్య కాదని, పిల్లలందరి సమస్య అని పేర్కొంటున్నారు. పని ఒత్తిడి నుంచి పిల్లలను కాపాడండి అని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.