TS News: పరిహారం చెల్లిస్తే.. మరియమ్మ ప్రాణం తిరిగొస్తుందా?: హైకోర్టు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో మరియమ్మ మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. పీయూసీఎల్‌ దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మ,

Updated : 10 Nov 2021 17:48 IST

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో మరియమ్మ మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. పీయూసీఎల్‌ దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మరియమ్మ మృతిపై విచారణ నివేదికను మేజిస్ట్రేట్‌ హైకోర్టుకు సమర్పించారు. నివేదిక పరిశీలించిన ధర్మాసనం మరియమ్మ కేసు సీబీఐకి అప్పగించదగిన కేసని అభిప్రాయపడింది. ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌కు అప్పగించాలని ఏజీని ఆదేశించింది.

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్టు ఏజీ ప్రసాద్‌ కోర్టుకు తెలపగా.. బాధ్యులైన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించామని ఏజీ తెలపగా.. పరిహారం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర ఆరోగ్య సమస్యలున్న మరియమ్మ గుండె ఆగి చనిపోయిందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకురాగా.. రెండో పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం మరియమ్మ ఒంటిపై గాయాలున్నాయని, గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా అని హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమని పేర్కొంది. సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణ ఈనెల 22కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని