Top Ten News @ 9AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి

Updated : 30 Oct 2021 10:03 IST

1.హుజూరాబాద్‌, బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం

తెలంగాణలోని హుజూరాబాద్‌, ఏపీలోని బద్వేలు శాసనసభ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. తొలుత మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ ఎన్నికలను అధికార తెరాస, వైకాపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

2.ఇంటి నిర్మాణంపై ధరల దరువు
ఉక్కు ధర నెల రోజుల వ్యవధిలోనే టన్నుకి రూ.10 వేల వరకు పెరిగింది. రెండు, మూడు నెలల వ్యవధిలో సిమెంట్‌ ధర బస్తాకి రూ.50-60 పెరిగింది. ఎలక్ట్రిక్‌, ప్లంబింగ్‌ సామగ్రి, రంగులు తదితరాల ధరలూ 20-30% వరకు పెరిగాయి. ఇసుక సైతం భారంగా మారింది. రాష్ట్రంలో భారీ నిర్మాణ, వాణిజ్య ప్రాజెక్టులు చేస్తున్న బిల్డర్లతోపాటు సొంతానికో చిన్న గూడు కట్టుకోవాలనే సామాన్యులకూ ఇది శరాఘాతంగా మారింది.

3.గాలి నుంచి తాగునీరు!

‘‘భూమిపై ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి సురక్షిత తాగునీరు అందుబాటులో లేదు. పర్యావరణంలో ప్రతికూల మార్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంక్షోభం మున్ముందు మరింత ముదిరే ముప్పుంది. 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా మంచినీటి వనరులు ఇప్పుడున్న స్థాయితో పోలిస్తే 40% మేర తగ్గిపోనున్నాయి’’ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఒకటి ఇటీవల తమ నివేదికలో బయటపెట్టిన కఠోర వాస్తవాలివి! ఈ ఆందోళనకర పరిస్థితుల నుంచి మానవాళిని గట్టెక్కించే తరుణోపాయాన్ని అమెరికాలోని ‘ఎక్స్‌- ది మూన్‌షాట్‌ ఫ్యాక్టరీ’ సంస్థకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. 

4.గుండెలయ గమనించండయా!

ఇరవై నుంచి 25 ఏళ్లు నిండకుండానే వ్యాయామం చేస్తూ మృత్యువాత పడటం.. మరణం అంచు వరకూ వెళ్లడం ఇటీవల సాధారణమయ్యాయి. కన్నడ సినీ కథానాయకుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ శుక్రవారం జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో వైద్యులు ఎంత యత్నించినా ప్రాణాలు నిలపలేకపోయారు. ఆరోగ్యకర అలవాట్లున్నా 46 ఏళ్లకే మరణించటం చర్చనీయాంశమైంది. 

5.భారత్‌కు తలమానికం తెలంగాణ

ఆవిర్భవించిన అనతికాలంలోనే తెలంగాణ ఎన్నో అద్భుతాలను సాధిస్తూ దేశానికి తలమానికంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పారిశ్రామికరంగంలో ప్రపంచదేశాలతో పోటీ పడుతోందని తెలిపారు. ప్రపంచ దిగ్గజ సంస్థలకు చిరునామాగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వ సానుకూల విధానాలు, వాతావరణం, పర్యావరణ వ్యవస్థలతో పెట్టుబడులకు అనుకూలంగా నిలుస్తోందని, భారత్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చే సంస్థలకు ఎక్కడా లేనన్ని రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నామని చెప్పారు.

6.రాకెట్‌ వదిలి.. రాజకీయాలకు కదిలి

భారత టెన్నిస్‌ చరిత్రలో ఓ వీరుడి సుదీర్ఘ ప్రస్థానానికి తెరపడింది. మూడు దశాబ్దాల పాటు తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వేదికపై మువ్వన్నెల పతాకాన్ని ఎగరేసిన ఆ దిగ్గజం.. ఇప్పుడు కోర్టుకు గుడ్‌బై చెప్పేశాడు. ఎన్నో ప్రతిష్ఠాత్మక విజయాలను అందించిన అతని రాకెట్‌ ఇక సెలవు తీసుకుంది. దేశంలో టెన్నిస్‌కు ఆదరణ పెంచి.. ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన అతని అడుగులు.. ఇప్పుడు రాజకీయాల వైపు సాగాయి. అతనే.. ప్రపంచ డబుల్స్‌ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన లియాండర్‌ పేస్‌.

7.యూరప్‌ అందాల్ని చూపిస్తోన్న ముద్దపప్పు ఆవకాయ్‌!

వృత్తితో పాటు ప్రవృత్తికీ ప్రాధాన్యం ఇస్తోంది ఈతరం. అందుకు సామాజిక మాధ్యమాల్నే వేదికగా చేసుకుని అడుగులేస్తోంది. అలా విదేశీ వింతల్ని చూపిస్తూ, తెలుగుదనాన్ని పంచుతోన్న యూట్యూబర్స్‌లో సుంకర దీప్యాశరణ్య ఒకరు. ‘యూరప్‌లో ముద్దపప్పు ఆవకాయ్‌’ అంటూ..

8,ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్‌

ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలుకావడంతో ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్‌ అయ్యాయి. ఇప్పటివరకు ఎయిర్‌ ఇండియా ప్రభుత్వరంగ సంస్థగా ఉండటం వల్ల ఎంపీలకు ప్రొటోకాల్‌ అమలు చేసేవారు. ఇకమీదట ఆ సదుపాయం ఉండదు. ఎంపీలు డబ్బు పెట్టి విమాన టికెట్లు కొనాలని శుక్రవారం విడుదలైన రాజ్యసభ సచివాలయ బులెటిన్‌ సభ్యులకు సూచించింది.

9.కరోనా వైరస్‌ పునరుత్పత్తికి అడ్డుకట్ట

కొవిడ్‌ చికిత్సలో మరో సంచలన ముందడుగు! శరీరంలో కరోనా వైరస్‌ పునరుత్పత్తిని అడ్డుకునే సరికొత్త ఔషధాన్ని బ్రిటన్‌, జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలో పెంటోస్‌ ఫాస్ఫేట్‌ పాత్‌వే అనే జీవక్రియ చైతన్యవంతం అయినప్పుడు... కరోనా సోకిన కణాలు ఆ వైరస్‌ను పునరుత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియను లక్ష్యంగా చేసుకుని బ్రిటన్‌లోని కెంట్‌, జర్మనీకి చెందిన గోతె వర్సిటీల శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు.

10.అప్పూ.. హైదరాబాద్‌ అభిమాని!

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ తనయుడిగా అడుగుపెట్టినా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. ఎంతోమంది అభిమానుల్ని పొందిన పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌.. హైదరాబాద్‌ అభిమాని. ఇటీవలె విడుదలైన ‘యువరత్న’ సినిమా ప్రమోషన్‌ కోసం నగరానికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని పంచుకున్నారు. తన చిత్రాల్లో ఎక్కువ శాతం రామోజీ ఫిలింసిటీలోనే చిత్రీకరించామని, తరచూ ఇక్కడికి వస్తుండటంతో భాగ్యనగరంలోని అన్నిరకాల వంటకాలు పరిచయమయ్యాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని