Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 Jul 2021 09:13 IST

1. Windows: కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి

విండోస్‌ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని దిగ్గజ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ కోరింది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో తీవ్ర లోపం బయటపడటమే ఇందుకు కారణమని తెలిపింది. ఆ లోపాన్ని ఉపయోగించుకుంటూ హ్యాకర్లు డేటా చోరీకి తెగబడే ముప్పుందని హెచ్చరించింది. దాన్ని నివారించేందుకు ఓ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించింది. సాధారణంగా ఒకే ప్రింటర్‌ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్‌లో ‘ప్రింట్‌ స్పూలర్‌’ ఉపయోగపడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. TS news: మార్కెట్లోకి కొత్త బిచ్చగాళ్లు

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహాశక్తి. ఆయనలాంటి నాయకుడిని, తెరాస వంటి పార్టీని ఎదుర్కొనే సత్తా ఎవ్వరికీ లేదు. కేసీఆర్‌ను ఢీకొట్టాలనుకునే వారికి రాజకీయంగా నూకలు చెల్లినట్లే. ఇతర రాష్ట్రాలకూ సీఎంలు ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నది రాష్ట్రాన్నే తెచ్చిన ముఖ్యమంత్రి. 21 ఏళ్ల పాటు తెలంగాణ కోసం శ్రమించారు. వైఎస్సార్‌, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలతో కొట్లాడారని మరచిపోవద్దు’’ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* స్వీట్లు తినిపించుకుంటారు కానీ.... జల పంచాయితీపై చిత్తశుద్ధి లేదా?

3. 12-13 తేదీల్లో ఖగోళ అద్భుతం

భూమికి పొరుగునున్న శుక్ర, అంగారక గ్రహాలు ఈ నెల 13న కనువిందు చేయనున్నాయి. ఆకాశంలో ఇవి పరస్పరం చాలా దగ్గరగా కనిపించనున్నాయి. 12న ఆ గ్రహాలకు దగ్గరగా చందమామ కూడా దర్శనమిస్తుంది. ఎలాంటి సాధనాలు అవసరం లేకుండానే కంటితో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించొచ్చు. ఆయా గ్రహాల కక్ష్య దృష్ట్యా అరుదైన సందర్భాల్లో అవి భూమి నుంచి చూసినప్పుడు దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. పరస్పరం అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు అంగారకుడు, శుక్రుడు మధ్య ఎడం 0.5 డిగ్రీల మేర మాత్రమే ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సలహాదారుల విధులేంటి?

‘ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, సలహాదారుల నియామక విధానం, వారికి అప్పగించిన విధుల స్వభావం ఏమిటి? విధుల నిబంధనలు, విధి విధానాలేంటో అదనపు అఫిడవిట్‌ రూపంలో మా ముందు ఉంచండి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొంతమంది సలహాదారులు రాజకీయ అంశాలనూ మీడియాతో మాట్లాడటంపై తీవ్రంగా ఆక్షేపించింది. కొందరు సలహాదారులు రాజకీయ విషయాలు మీడియాతో మాట్లాడటం చట్ట వ్యతిరేకం కాదా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. AP news: గుంటూరు జిల్లా జవాను వీరమరణం

జమ్ముకశ్మీర్లోని రాజౌరిలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుంటూరు జిల్లాకు చెందిన జవాను ప్రాణాలు కోల్పోయారు. సుందర్‌బని సెక్టార్‌లో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జశ్వంత్‌రెడ్డి (23) మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన స్వస్థలం బాపట్ల మండలం దరివాద కొత్తపాలెం. ఐదేళ్ల క్రితమై సైన్యంలో చేరారు. జశ్వంత్‌రెడ్డి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కేరళలో తొలి జికా వైరస్‌ కేసు

కేరళలో తొలిసారిగా జికా వైరస్‌ కేసు వెలుగు చూసింది. 24 ఏళ్ల మహిళలో ఈ వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి గురువారం చెప్పారు. తిరువనంతపురంలో మరో 13 అనుమానిత కేసులు ఉన్నాయని, వాటికి సంబంధించి పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ) నుంచి ధ్రువీకరణ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ‘‘తిరువనంతపురం నుంచి 19 నమూనాలు ల్యాబ్‌కు వెళ్లాయి. వారిలో వైద్యులు సహా 13 మంది ఆరోగ్య కార్యకర్తలకు జికా వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నాం’’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ష్‌.. గప్‌చుప్‌!

7. ఈ ఏడాదిలో ‘మూడో దశ’ రాదు

రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి కొవిడ్‌ మూడోదశ ఉద్ధృతి వచ్చే అవకాశాలు లేవని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఒకవేళ వచ్చినా.. దాని ప్రభావ తీవ్రత తక్కువేనని ఆయన స్పష్టం చేశారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మన దగ్గర రెండోదశలో డెల్టా వేరియంట్‌ తీవ్ర ప్రభావం చూపిందని, ఈ వైరస్‌ ప్రభావం ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తోందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నా భర్త, తమ్ముడిపై తప్పుడు కేసు

తన భర్త భార్గవ్‌, తమ్ముడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని, పోలీసులను అడ్డుపెట్టుకుని తమపై కక్షసాధింపు చర్యలు చేపట్టడం సరికాదని మాజీమంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆమె గురువారం కర్నూలులో విలేకర్లతో మాట్లాడారు. కొన్ని రోజుల కిందట తన భర్త, తమ్ముడు పక్క రాష్ట్రం వెళ్లివచ్చి, తర్వాత కరోనా పరీక్ష చేయించుకున్నారన్నారు. కొన్ని గంటలకే పోలీసులు వచ్చి స్టేషన్‌కు రావాలంటూ చెప్పారన్నారు. ల్యాబ్‌ నిర్వాహకులు తన భర్తకు పాజిటివ్‌ అని రిపోర్టు ఇచ్చారని, పోలీసులకు మాత్రం నెగెటివ్‌ ఉన్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వైద్య ఖర్చులన్నీ రావాలంటే..

పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే ఆరోగ్య బీమా ఇప్పుడు తక్షణ అవసరం. కొత్తగా దీన్ని తీసుకునే వారు తాము తీసుకుంటున్న పాలసీ ఎంత మేరకు తమకు రక్షణ కల్పిస్తుందో ఒకటికి రెండుసార్లు పరిశీలించి చూసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకోకుండా తీసుకొని, తీరా క్లెయిం చేసిన తర్వాత పరిహారం తగ్గించి ఇస్తామని బీమా సంస్థ చెబితే.. ఆందోళన తప్పదు. ఈ విషయంలో చాలామందికి ఆర్థికకష్టాలు వచ్చిన ఇక్కడ మర్చిపోకూడదు. అందుకే,  పాలసీని ఏ సందర్భంలో తిరస్కరిస్తారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇంగ్లాండ్‌.. 55 ఏళ్ల తర్వాత

ఎన్నేళ్లకెన్నేళ్లకు..! ఓ పెద్ద టోర్నమెంట్లో ఇంగ్లాండ్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. 55 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ జట్టు ఓ మెగా టోర్నీలో ఫైనల్‌ చేరింది. యూరో కప్‌లో ఇంగ్లాండ్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో ఆ జట్టు 2-1 గోల్స్‌తో డెన్మార్క్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌ ఆరంభంలో జోరు డెన్మార్క్‌దే. దూకుడుగా ఆడిన ఆ జట్టు 30వ నిమిషంలో గోల్‌ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. ఫ్రీకిక్‌ను సద్వినియోగం చేస్తూ డామ్స్‌గార్డ్‌ బంతిని గోల్‌పోస్టులోకి కొట్టడంతో డెన్మార్క్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏమో.. మళ్లీ వింబుల్డన్‌లో ఆడతానో లేదో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని