కడుపు మాడ్చి.. గుండు కొట్టించి: డ్రగ్స్‌ బానిసలపై తాలిబన్ల అరాచకం

అఫ్గానిస్థాన్‌లో మాదక ద్రవ్యాల బానిసలతో తాలిబన్లు వ్యవహరిస్తున్న తీరు వారి అరాచక పాలనకు మరో నిదర్శనంగా నిలుస్తోంది. వారిని బాధితులుగా పరిగణించి సరైన వైద్య చికిత్స అందించాల్సిందిపోయి, అనాగరిక చర్యలకు పాల్పడుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. కాబుల్‌లో వేల మంది నిరాశ్రయులు

Published : 11 Oct 2021 06:53 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో మాదక ద్రవ్యాల బానిసలతో తాలిబన్లు వ్యవహరిస్తున్న తీరు వారి అరాచక పాలనకు మరో నిదర్శనంగా నిలుస్తోంది. వారిని బాధితులుగా పరిగణించి సరైన వైద్య చికిత్స అందించాల్సిందిపోయి, అనాగరిక చర్యలకు పాల్పడుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. కాబుల్‌లో వేల మంది నిరాశ్రయులు హెరాయిన్‌ లాంటి మత్తు పదార్థాలకు ఏళ్ల తరబడి అలవాటు పడ్డారు. దీనివల్ల వారి శరీరాలు చిక్కి శల్యమై, కళ్లలో జీవం కోల్పోయి జీవచ్ఛవాల్లా కనిపిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది అక్కడి రహదారుల వంతెనల కింద తలదాచుకుంటుంటారు. తాలిబన్‌ పోలీసులు రాత్రిపూట అక్కడ ఆకస్మిక దాడులు జరిపి డ్రగ్స్‌ బానిసలను అదుపులోకి తీసుకుంటున్నారు. వారి చేతులు కట్టేసి బలవంతంగా ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు. మొండికేసినవారిని కనికరం లేకుండా తీవ్రంగా కొడుతున్నారు. జైళ్లను తలపించే ఆ శిబిరాల్లో వారికి ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. మత్తు పదార్థాల వినియోగాన్ని వదిలివేయాలని లేకపోతే చావుదెబ్బలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బలవంతంగా శిరోముండనం చేయిస్తున్నారు. సరైన తిండి పెట్టకుండా ఆకలితో అలమటించేలా చేస్తున్నారు. ఇస్లాం విశ్వాసాల ప్రకారం మత్తు పదార్థాల వ్యసనపరులను సమాజ వినాశకారులని పేర్కొంటున్న తాలిబన్లు, ఆ అలవాటును మానిపించడానికి ఇలాంటి కర్కశ విధానాలే సరైన మార్గమని భావిస్తున్నారు. ఈక్రమంలో కొందరు మరణించినా తప్పేం లేదని, మిగిలినవారు సజ్జనులుగా మారుతారని ప్రకటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని