ఈ 10రాష్ట్రాల్లో కట్టడిచేస్తే.. కరోనాపై విజయమే!

దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న పదిరాష్ట్రాలు వైరస్‌ను కట్టడి చేయగలిగితే కరోనాపై భారత్‌ విజయం సాధించినట్లేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు.

Updated : 11 Aug 2020 15:54 IST

72గంటల ఫార్ములానే కీలకమన్న ప్రధాని మోదీ..
కొవిడ్‌ టెస్టులు పెంచాలని రాష్ట్రాలకు సూచన

దిల్లీ: దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న పదిరాష్ట్రాలు వైరస్‌ను కట్టడి చేయగలిగితే కరోనాపై భారత్‌ విజయం సాధించినట్లేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా పరిస్థితులు, అన్‌లాక్‌ అమలుపై నేడు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మోదీ ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో దాదాపు 80శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని ప్రధాని తెలిపారు. ఈ సమయంలో పది రాష్ట్రాలు వైరస్‌ను కట్టడి చేయగలిగితే కరోనా పోరులో భారత్‌ విజయం సాధించినట్లేనని పునరుద్ఘాటించారు. అందుకే ఈ రాష్ట్రాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని సూచించారు. ముఖ్యంగా బిహార్‌, గుజరాత్‌, యూపీ, పశ్చిమబెంగాల్‌, తెలంగాణల్లో కొవిడ్‌ టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని, పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రాల్లో టెస్టులసంఖ్య భారీగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

72గంటలే ఫార్ములాతో సాధ్యమే..
వైరస్‌ సోకిన వ్యక్తిని 72గంటల్లోగా గుర్తించి పరీక్షిస్తే వైరస్‌ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అందుకే వైరస్‌ నిర్దారణ అయిన వ్యక్తిని కలిసిన వారు కూడా 72గంటల్లోపే పరీక్షలు చేయించుకోవాలని ప్రధాని సూచించారు. వైరస్‌ను కట్టడిచేయడం, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, పర్యవేక్షణలే వైరస్‌ పోరులో కీలక ఆయుధాలని ప్రధాని మరోసారి నొక్కిచెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు పెరగిందని మరణాల రేటు తగ్గుతున్నాయని మోదీ అన్నారు.

లాక్‌డౌన్‌ తరువాత పరిస్థితులు, అన్‌లాక్‌-3 అమలు జరుగుతున్న తీరుతెన్నులను పది రాష్ట్రాల సిఎంలను ప్రధాని అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. దేశంలో కరోనా వైరస్‌ సంక్షోభం ప్రారంభమైనప్పటినుంచి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో భేటీ కావడం ఇది ఏడోసారి.

ఇదిలాఉంటే, ప్రస్తుతం రోజువారీ కేసులు అత్యధికంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22లక్షలు దాటగా మరణాల సంఖ్య 45వేలు దాటింది.

ఇవీ చదవండి..
భారత్‌లో 45వేలు దాటిన కరోనా మరణాలు
పుతిన్‌ కుమార్తెకు కొవిడ్‌ టీకా..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని