వీరందరికీ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందే..

కరోనా నిర్ధారణ పరీక్షలపై భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షల కోసం ముందుకు వచ్చిన ప్రతిఒక్కరికీ టెస్టులు చేయాల్సిందేనని తెలిపింది. అయితే, రాష్ట్రాలు ఈ మార్గదర్శకాల్ని సవరించుకోవచ్చని స్పష్టం చేసింది...........

Updated : 05 Sep 2020 12:36 IST

పరీక్షల నిర్వహణపై ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాలు

దిల్లీ: కరోనా నిర్ధారణ పరీక్షలపై భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షల కోసం ముందుకు వచ్చిన ప్రతిఒక్కరికీ టెస్టులు చేయాల్సిందేనని తెలిపింది. అయితే, రాష్ట్రాలు ఈ మార్గదర్శకాల్ని సవరించుకోవచ్చని స్పష్టం చేసింది. విదేశాలకు లేదా దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించింది. కొవిడ్‌-19 నెగటివ్‌ ధ్రువపత్రం అవసరమున్న ప్రతి ప్రయాణికుడికి వారి కోరిక మేరకు పరీక్షలు జరపాలని తెలిపింది. పరీక్షల్ని మరింత సమర్థంగా, సులువుగా నిర్వహించేలా రాష్ట్రాలు అవసరమైతే మార్గదర్శకాల్ని సవరించుకోవచ్చునని స్పష్టం చేసింది. 

ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు..

* కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో ఉండే ప్రతిఒక్కరికీ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించాలి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాల్లో తప్పనిసరిగా ఈ పరీక్షలు జరపాలి.

* ప్రసవం వంటి అత్యవసర పరిస్థితుల్లో..  కొవిడ్‌-19 నెగటివ్‌ ధ్రువపత్రం లేదనే కారణంగా చికిత్సను నిరాకరించరాదని, ఆలస్యం చేయరాదు.

* కంటైన్‌మెంట్‌ జోన్లలో వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సహా వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారందరికీ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి.

* హెల్త్‌కేర్‌ వర్కర్లు సహా ఇతర అత్యవసర సేవలు అందించే సిబ్బందిలో ఏమాత్రం లక్షణాలున్నా వెంటనే పరీక్షలు నిర్వహించాలి. వారి కుటుంబ సభ్యులు సహా వారితో నేరుగా కలిసి లక్షణాలు లేని వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలి. ముఖ్యంగా ముప్పు ఎక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలి.

* పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఐదు రోజుల నుంచి 10 రోజుల మధ్య మరోసారి పరీక్షలు జరపాలి. 

* తొలుత ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ సిఫార్సు చేయాలి. ఆ తర్వాత ఆర్‌టీ-పీసీఆర్‌ లేదా ట్రూనాట్ లేదా సీబీఎన్‌ఏఏటీ టెస్టులు సూచించాలి.

* ఆస్పత్రిలో చేరి లక్షణాలున్న, సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగులకు పరీక్షలు నిర్వహించాలి. అలాగే ముప్పు ఎక్కువగా ఉండేవారికి కూడా పరీక్షలు జరపాలి. 

* లక్షణాలు లేకున్నా శస్త్ర చికిత్సలకు వెళ్లే ప్రతిఒక్కరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ఆస్పత్రిలో ఉన్నంత కాలం వారంలో ఒకసారికి మించకుండా టెస్టులు చేయాలి. ప్రసవం కోసం చేరిన ప్రతిఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలి. 

* పాజిటివ్‌గా నిర్ధారణ అయిన చంటి పిల్లల తల్లులు బిడ్డ దగ్గరకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. పాలిచ్చే ముందు రొమ్ములను శుభ్రపరచుకోవాలి. చిన్న పిల్లల్లో ఏమాత్రం లక్షణాలున్నా, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా పరీక్షలు జరపాలి. 

* ఆర్‌టీ-పీసీఆర్‌, ట్రూనాట్‌, సబీఎన్‌ఏఏటీ, ర్యాపిడ్‌ పరీక్షల్లో ఒకసారి పాజిటివ్‌గా తేలితే వైరస్‌ సోకినట్లు నిర్ధారించాలి. కొవిడ్‌ సంరక్షణ కేంద్రాల నుంచి డిశ్చార్జి అయ్యే వరకు రెండోసారి పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. 

* ర్యాపిడ్‌ పరీక్షలో నెగటివ్‌గా తేలినా.. లక్షణాలుంటే మరోసారి ర్యాపిడ్‌ లేదా ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష నిర్వహించాలి. 

* ఎలాంటి శస్త్రచికిత్సతలకు వెళ్లేవారైనా.. 14 రోజుల ముందు నుంచే హోం ఐసోలేషన్‌లో ఉండాలి. తద్వారా వైరస్‌ సోకే ముప్పు తగ్గించుకోవాలి.
 

ఇవీ చదవండి..
మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్‌

24 గంటల్లో 86,432 కేసులు.. 1089 మరణాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని