చైనా పేరెత్తకుండానే చక్కబెట్టేస్తున్నారు..!
అమెరికాలో అత్యంత కీలకమైన ఎన్నికలకు కేవలం వారం మాత్రమే గడువు మిగిలింది. దీంతో అధ్యక్షుడు ట్రంప్, ఆయన కార్యవర్గం ప్రచారంలో తలమునకలైంది.. అదే సమయంలో ట్రంప్ అత్యంత కీలకమైన వ్యక్తిగా భావించే సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్లు
చకచకా భారత్ కీలక ఒప్పందాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అమెరికాలో అత్యంత కీలకమైన ఎన్నికలకు కేవలం వారం మాత్రమే గడువు ఉంది. దీంతో అధ్యక్షుడు ట్రంప్, ఆయన కార్యవర్గం ప్రచారంలో తలమునకలైంది.. అదే సమయంలో ట్రంప్ అత్యంత కీలకమైన వ్యక్తిగా భావించే సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్లు భారత్కు వచ్చేందుకు విమానమెక్కారు. కొవిడ్ సమయంలో పాంపియో చాలా దేశాల పర్యటనలను రద్దు చేసుకొని.. వర్చువల్ మీటింగ్స్లోనే పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన నేరుగా భారత్ రావడానికి చాలా పెద్దకారణమే ఉంది. అది చైనా..! ఇరు దేశాలు ఉమ్మడి ముప్పుగా భావిస్తున్న చైనాను కట్టడి చేయడానికి కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. దీనికి సంబంధించిన 2+2 చర్చలు దిల్లీలో ప్రారంభం కానున్నాయి. అంతకు ముందు జరిగిన క్వాడ్ దేశాల సమావేశంలో భారత్ ఎక్కడా అధికారికంగా చైనా పేరు ప్రస్తావించలేదు. కానీ, డ్రాగన్కు కళ్లెం వేసేలా ఏర్పాట్లు చేసుకొంది. తాజా చర్చలకు సంబంధించిన ముందస్తు ప్రకటనలో కూడా ఎక్కడా చైనా పేరు లేదు.. కానీ లక్ష్యం మాత్రం డ్రాగన్ కట్టడే.
ఏమిటీ 2+2 చర్చలు..?
రెండు దేశాల మధ్య ఇటువంటి చర్చలు జరుగుతాయి. విదేశాంగ శాఖ, రక్షణ శాఖ మంత్రులు తమకు సమాన హోదా వ్యక్తులతో భేటీ అవుతారు. ముఖ్యంగా రక్షణ పరమైన అంశాలు.. విదేశాంగ విధానాలపై ఎక్కువగా చర్చిస్తారు. జపాన్ కీలకమైన దేశాలతో చర్చలకు ఈ విధానాన్ని అమలు చేస్తుంది. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, ఆస్ట్రేలియా, భారత్లతో ఈ విధానాన్నే ఉపయోగిస్తోంది. భారత్ కూడా అమెరికా, జపాన్లతో మంత్రుల స్థాయిలో 2+2 చర్చలు జరుపుతుంది. ఆస్ట్రేలియాతో మాత్రం కార్యదర్శుల స్థాయిలో వీటిని నిర్వహిస్తుంది.
ఈ సారి చర్చలకు చాలా ప్రాధాన్యం..?
ఓ పక్క లద్దాఖ్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో భారత్ భద్రతా పరమైన అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టే అవకాశం ఉంది. భారత్-అమెరికా మధ్య పరస్పర అవసరాల కోసం సమన్వయం పెంచుకోవడం.. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై దృష్టిపెట్టడం ఈ చర్చల ముఖ్య లక్ష్యమని తెలిపారు. పాంపియో, ఎస్పర్లు తమ పర్యటనలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్తో భేటీ కానుండటం విశేషం. దీంతోపాటు అమెరికాకు చెందిన ఉపగ్రహాలు, సెన్సర్లు ప్రపంచ వ్యాప్తంగా సేకరించే కీలకమైన భౌగోళిక, అంతరిక్ష సమాచారాన్ని భారత్తో పంచుకొనేలా బేసిక్ ఎక్స్ఛేంజి అండ్ కోపరేషన్ అగ్రిమెంట్ (బెకా)పై సంతకాలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ ఒప్పందంతో చైనాకు కళ్లెం ఇలా..
ఈ ఒప్పందం జరిగితే భారత్-అమెరికాల మధ్య రక్షణ రంగ సహకారానికి అవసరమైన మూడు ఒప్పందాలు పూర్తవుతాయి. అంతకుముందే భారత్ లెమోవా, కోంకాసా అనే ఒప్పందాలను చేసుకొంది. హిమాలయాల్లో సైనికులు చేరుకోవడానికి కొన్ని రోజులు పట్టే అత్యంత కఠిన ప్రదేశాలకు సంబంధించిన స్పష్టమైన ఛాయాచిత్రాలు, వీడియోలు భారత్కు అందుతాయి. వీటిని అత్యంత గోప్యమైన పరికరాల ద్వారా భారత్.. అమెరికాలోని డేటా సెంటర్ నుంచి తీసుకోవచ్చు. ఈ రేఖా చిత్రాల ఆధారంగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలను ఎప్పటికప్పుడు భారత్ తెలుసుకోవచ్చు. అప్పుడు పీఎల్ఏ ఆక్రమించడానికి కంటే ముందే భారత్ సేనలు ఆయా ప్రదేశాలను రక్షించుకోవచ్చు. ఒక రకంగా చైనా సేనలను ముందుకు రాకుండా అడ్డుకొనేందుకు ఈ సమాచారం కీలకం.
అంతేకాదు.. అమెరికాకు చెందిన డ్రోన్లు, యుద్ధవిమానాలు, హెలికాప్టర్లను కొనుగోలు చేస్తే.. వాటిని మెరుగ్గా వాడుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. భారత్ క్షిపణులు టార్గెట్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించే అవకాశం లభిస్తుంది.
ఇటీవల అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో మాట్లాడుతూ భారత్ సరిహద్దుల్లో చైనా దాదాపు 60వేల మంది సైనికులను మోహరించింది అని ప్రకటించారు. సాధారణంగా ఇటువటి సమాచారం ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి సంపాదించవచ్చు.
చైనా ఏమంటోంది..?
చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఈ భేటీపై స్పందించింది. భారత్ను మెల్లగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ‘‘అమెరికాతో టోక్యో వంటి భాగస్వామి వలే న్యూదిల్లీ ఉంటుందనుకోవడం కష్టమే. శక్తిమంతమైన దేశంగా ఎదగాలనుకొంటున్న భారత్ మరో పోటీదారుకు లొంగి ఉంటుందని అనుకోం’’ అని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్