అమెరికా కవయిత్రికి నోబెల్‌

సాహిత్య రంగంలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం అమెరికాకు చెందిన కవయిత్రి లూయీస్‌ గ్లక్‌ను వరించింది. ఈ మేరకు స్వీడన్‌ అకాడమీ గురువారం ప్రకటించింది. 1943లో న్యూయార్క్‌లో జన్మించిన లూయీస్‌.

Updated : 08 Oct 2020 17:55 IST

స్టాక్‌హోం: సాహిత్య రంగంలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం అమెరికాకు చెందిన కవయిత్రి లూయిస్‌ గ్లక్‌ను వరించింది. ఈ మేరకు స్వీడన్‌ అకాడమీ గురువారం ప్రకటించింది. 1943లో న్యూయార్క్‌లో జన్మించిన లూయిస్‌.. కనెక్టికట్‌లోని యాలే యూనివర్శిటీలో ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 1968లో ఫస్ట్‌బార్న్‌ పేరుతో తొలి కవిత రాసిన లూయిస్‌.. కొద్ది కాలంలో అమెరికా సాహిత్యరంగంలో ప్రముఖ కవయిత్రిగా పేరుగాంచారు. తన కవితలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన ఆమె.. ప్రఖ్యాత పులిట్జర్‌ పురస్కారం, నేషనల్‌ బుక్‌ అవార్డ్‌ వంటి ఎన్నో పురస్కారాలు పొందారు. లూయిస్‌ రాసిన ది వైల్డ్‌ ఐరిష్‌‌ కవితకు 1993లో పులిట్జర్‌ అవార్డును అందుకున్నారు. 

నోబెల్‌ సాహిత్య పురస్కారాలపై గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పురస్కారాల విజేతలను ఎంపిక చేసే స్వీడిష్‌ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 2018లో సాహిత్య రంగంలో నోబెల్‌ ప్రకటనను వాయిదా వేశారు. ఆ తర్వాత గతేడాది 2018, 2019 సంవత్సరాలకు గానూ రెండు పురస్కారాలను ఒకేసారి ప్రకటించారు. 2018 ఏడాదికి గానూ పొలాండ్‌కు చెందిన ప్రముఖ కవయిత్రి ఓల్గాకు పురస్కారం దక్కింది. 1901 నుంచి ఇప్పటివరకు సాహిత్య రంగంలో 117 మంది నోబెల్‌ ఇవ్వగా.. వీరిలో మహిళలు 16 మంది ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని