
ట్రంప్ సర్కార్ నిర్ణయంపై న్యాయ పోరాటం
పిటిషన్ దాఖలు చేసిన హార్వర్డ్, ఎమ్ఐటీ
న్యూయార్క్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశీ విద్యార్థులను వెనక్కి పంపించే విధంగా అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమెరికాలోని ప్రముఖ విద్యాసంస్థలైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) స్థానిక న్యాస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఏజెన్సీల నూతన మార్గదర్శకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరాయి. రెండు ఫెడరల్ ఏజెన్సీల మార్గదర్శకాలు విదేశీ విద్యార్థులను బలవంతంగా అమెరికా నుంచి పంపే విధంగా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నాయి.
ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ లారెన్స్ బాకో మాట్లాడుతూ ‘‘ఎలాంటి ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా ఆదేశాలు జారీచేశారు. ఇది వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. ఐసీఈ ఆదేశాలు చట్ట వ్యతిరేకం అని భావిస్తున్నాం. దీనిపై మేం చాలా గట్టిగా న్యాయపోరాటం చేస్తాం. అప్పుడే దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు వెనక్కి వెళ్లకుండా అన్ని విద్యాసంస్థల్లో తమ విద్యను కొనసాగించగలరు’’ అని అన్నారు.
వచ్చే విద్యాసంవత్సరానికి పూర్తిస్థాయిలో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో చదవబోయే విద్యార్థులకు అమెరికాలోకి ప్రవేశించేందుకు వీసా మంజూరు చేయబోమని ఐసీఈ సోమవారం ప్రకటించింది. అలానే ఇప్పటికే అమెరికాలో ఉన్న వారు తమ దేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఒక వేళ ఎవరైనా చట్టబద్ధంగా ఉండాలనుకుంటే భౌతికంగా తరగతుల హాజరయ్యేందుకు అనుమతిస్తున్న విద్యాసంస్థలకు బదిలీ కావాలని సూచించింది. ఇప్పటికే అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులకు ఏజెన్సీల నిర్ణయం ఆందోళన కలిగించేదిగా ఉందని పలు విద్యాసంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కొత్త విద్యాసంవత్సరం కోసం అమెరికాకు రావాలనుకుంటున్న విద్యార్థులపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నాయి.
ఇదీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.