Vaccine: తల్లిపాలలో కొవిడ్ టీకా జాడలేదు
కొవిడ్-19 నివారణకు రూపొందించిన మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) టీకా జాడలు తల్లి పాలలోకి చేరడంలేదని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీంతో ఈ టీకాలు శిశువులోకి
శాస్త్రవేత్తల వెల్లడి
వాషింగ్టన్: కొవిడ్-19 నివారణకు రూపొందించిన మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) టీకా జాడలు తల్లి పాలలోకి చేరడంలేదని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీంతో ఈ టీకాలు శిశువులోకి ప్రవేశించబోవనడానికి ఆధారాలు లభించినట్లయింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా ఎంఆర్ఎన్ఏ టీకా పొందిన ఏడుగురు మహిళల స్తన్యాన్ని విశ్లేషించారు. వ్యాక్సిన్ల వల్ల తల్లిపాలు మారిపోతాయన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ భయంతో.. బిడ్డలకు పాలిచ్చే తల్లులు అనేకమంది టీకాలకు దూరంగా ఉండిపోతున్నారు. వీరు వ్యాక్సిన్లు పొందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సిఫార్సు చేసింది. ఎంఆర్ఎన్ఏ రేణువులు తల్లి రొమ్ము కణజాలంలోకి గానీ పాలలోకి గానీ ప్రవేశించి, అనంతరం వాటి ద్వారా చిన్నారి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేయడానికి అవకాశం లేదని పేర్కొంది. ఆ వాదనను తాజా పరిశోధన సమర్థించింది. తల్లిపాలలో గుర్తించదగ్గ స్థాయిలో ఎంఆర్ఎన్ఏ రేణువులు కనిపించలేదని వివరించింది. పరిశోధనలో పాల్గొన్న తల్లులకు ఒక నెల నుంచి మూడేళ్ల వయసున్న చిన్నారులు ఉన్నారు. టీకా పొందిన 48 గంటల తర్వాతే వీరి నుంచి నమూనాలను సేకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.