ఒక్కో మరణానికి రూ.50 వేలు.. కొవిడ్‌ మృతులకు పరిహారంపై సుప్రీంకోర్టు

కరోనా వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి రక్తసంబంధీకులకు చెల్లించాల్సిన పరిహారంపై గత ఉత్తర్వులోనే స్పష్టమైన ఆదేశాలిచ్చామని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక్కో మరణానికి రూ.50వేల చొప్పున బాధిత కుటుంబానికి అందజేయాల్సి

Published : 15 Mar 2022 08:26 IST

దిల్లీ: కరోనా వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి రక్తసంబంధీకులకు చెల్లించాల్సిన పరిహారంపై గత ఉత్తర్వులోనే స్పష్టమైన ఆదేశాలిచ్చామని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక్కో మరణానికి రూ.50వేల చొప్పున బాధిత కుటుంబానికి అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. అస్సాం నుంచి దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ బి.వి.నాగరత్న ధర్మాసనం సోమవారం ఈ విషయాన్ని తెలిపింది. మృతులకు ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఎంత పరిహారం ఇవ్వాలో స్పష్టత లేదంటూ పిటిషనర్‌ పేర్కొన్నారు. పిల్లలు ఎంత మంది ఉన్నప్పటికీ కుటుంబంలో ఒకరు చనిపోతే రూ.50వేలు, ఇద్దరు మరణిస్తే రూ.లక్ష అందజేయాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తల్లిని, తండ్రిని కోల్పోయినట్లయితే...రెండు మరణాలుగా పరిగణించి రూ.లక్షను వారి సంతానానికి సమకూర్చాలని పేర్కొంది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన 10వేల మంది చిన్నారులను గుర్తించి వారికి పరిహారం అందజేయడంతో పాటు తగిన సహాయం అందజేయాలని జనవరి 19న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

పరిహారం కోసం ఇంత అనైతికమా?

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు అందించే రూ.50వేల పరిహారం పొందేందుకు కొందరు నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నైతిక విలువలు ఇంతలా దిగజారాయని ఊహించలేదని పేర్కొంది. ఇదే విషయంపై అవసరమైతే కాగ్‌ దర్యాప్తునకు ఆదేశిస్తామని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇటువంటి అక్రమాల వెనుక ప్రభుత్వ అధికారులు ఉంటే తీవ్రంగా పరిగణించాలని ఆదేశించింది. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం మంజూరుకు నిర్దిష్ట కాల పరిమితిని నిర్దేశించాలన్న ప్రతిపాదనను ధర్మాసనం పరిశీలించాలని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు. ఇలా చేస్తే నిజమైన అర్హులు గడువు మేరకు దరఖాస్తు చేసుకుంటారని తెలిపారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని