పాక్‌ చిన్నారికి కేరళ వైద్యుల పునర్జన్మ

అరుదైన వ్యాధితో బాధపడుతున్న పాకిస్థాన్‌ చిన్నారికి కేరళ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.

Updated : 05 Dec 2022 05:47 IST

విజయవంతంగా అస్థి మజ్జ మార్పిడి

అరుదైన వ్యాధితో బాధపడుతున్న పాకిస్థాన్‌ చిన్నారికి కేరళ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. పాక్‌లోని బలూచిస్థాన్‌కు చెందిన జలాల్‌, సాదూరి దంపతుల కుమారుడు సైఫ్‌ (2)కు ‘కంబైన్డ్‌ ఇమ్యునో డెఫీషియెన్సీ’ అనే అరుదైన వ్యాధి సోకింది. చికిత్సలో భాగంగా చిన్నారి అస్థి మజ్జ (బోన్‌మేరో) పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. ఈ వైద్యం కోసం బాలుడి తల్లిదండ్రులు పాకిస్థాన్‌లోని ఎన్నో ఆసుపత్రులకు తిరిగినా ఉపయోగం లేకపోయింది. యూఏఈలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అక్కడ కీమోథెరపీ చేశారు. అయినా బాలుడి పరిస్థితి మరింత దిగజారింది. పలురకాల ఇన్ఫెక్షన్లు సోకాయి. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షను కారణంగా రక్తంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గిపోయాయి. దీంతో సైఫ్‌ను వెంటిలేటరుపైన ఉంచి, దేవుడిపై భారం వేశారు. అన్ని ఆశలు సన్నగిల్లిన స్థితిలో కేరళలోని ఏస్తర్‌ మలబార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (మిమ్స్‌)లో అందుబాటులో ఉన్న చికిత్స అవకాశాల గురించి సైఫ్‌ తల్లిదండ్రులకు తెలిసింది. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. భారత విదేశాంగ శాఖ అధికారుల సహకారంతో చట్టపరమైన పనులన్నీ చకచకా పూర్తి చేసుకొని.. బాలుడిని కోజికోడ్‌కు తీసుకొచ్చారు. ఏస్తర్‌ మిమ్స్‌ ఆసుపత్రిలో ఉన్న సీనియర్‌ పీడియాట్రిక్‌ హెమటాలజిస్ట్‌ కేశవన్‌, ఆయన సహాయబృందం బాలుని ఆరోగ్య పరిస్థితిని చూసి వెంటనే వైద్యం ప్రారంభించారు. సైఫ్‌ తల్లి అస్థి మజ్జలో అతడి వైద్యానికి సరిపడా పోలికలను వైద్యులు గుర్తించారు. బోన్‌మేరో మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆపరేషను చేసిన రెండు నెలలకు సైఫ్‌ పూర్తిగా కోలుకున్నాడు.

సంతోషంగా పాక్‌కు వెళ్లొచ్చు..

‘అదృష్టవశాత్తు బాలునికి తన తల్లి బోన్‌మేరో మ్యాచ్‌ అయింది. ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు. వెంటిలేటరు అవసరం కూడా లేదు. సంతోషంగా వాళ్ల దేశానికి వెళ్లొచ్చు’ అని డాక్టర్‌ కేశవన్‌ తెలిపారు. ‘‘మేము ఇక్కడికి వచ్చేసరికే మా బిడ్డ పరిస్థితి చాలా విషమంగా ఉంది. బతికేందుకు అవకాశాలు మరీ తక్కువగా ఉన్న దశలో నా బిడ్డను కాపాడిన అందరికీ ధన్యవాదాలు’’ అని జలాల్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు