Influenza virus: H3N2 కొవిడ్ మాదిరిగా వ్యాపిస్తోంది.. జాగ్రత్త: గులేరియా

ఇటీవలి కాలంలో ఫ్లూ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై రణదీప్‌ గులేరియా( Randeep Guleria) స్పందించారు. రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 

Updated : 08 Mar 2023 10:59 IST

దిల్లీ: వేసవికాలంలో అడుగుపెడుతున్న సమయంలో జలుబు, దగ్గు, వైరల్‌ జ్వరాలు (Viral Fevers) ప్రజలను కంగారు పెడుతున్నాయి. కొవిడ్ (Covid) తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా (Influenza) కేసులు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులకు H3N2 వైరస్‌ రకం కారణం. ప్రస్తుతం ఈ కేసుల పెరుగుదలపై దిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్‌ గులేరియా( Randeep Guleria) స్పందించారు. ఈ ఫ్లూ తుంపర్ల రూపంలో కొవిడ్ మాదిరిగా వ్యాపిస్తుందని, ప్రతి ఏడాది ఈ సమయంలో వైరస్‌లో ఉత్పరివర్తనలు చోటుచేసుకుంటాయని వెల్లడించారు. ప్రస్తుతం పండగల సీజన్‌ కావడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో బాధపడేవారు మరింత జాగ్రత్త వహించాలన్నారు.

ఇదీ చదవండి:  పెరుగుతున్న ఫ్లూ కేసులు.. ఈ పనులు చేయొద్దు..!

‘H1N1 వైరస్ వల్ల గతంలో ఒక మహమ్మారిని చవిచూశాం. ఇప్పుడు దానికి సంబంధించిన సాధారణ వేరియంటే H3N2. దానిలో స్వల్పస్థాయిలో ఉత్పరివర్తనలు చోటుచేసుకోవడంతో ప్రస్తుతం ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు సులభంగా దీని ప్రభావానికి గురవుతున్నారు’ అని వెల్లడించారు. అయితే ఆసుపత్రిలో చేరికలు భారీ స్థాయిలో లేకపోవడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసులు పెరగడానికి గల రెండు కారణాలు వెల్లడించారు. ఈ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పులు, అలాగే కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటి నుంచి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించకపోవడం ఇందుకు కారణమన్నారు. 

ఫ్లూ లక్షణాలివే..

గత రెండు మూడు నెలలుగా ఈ ఫ్లూ (Influenza) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇతర సబ్‌టైప్‌లతో పోల్చితే ఈ ‘హెచ్‌3ఎన్‌2 (H3N2)’ రకం ఎక్కువగా ప్రభావం చూపుతోంది. దీని ప్రధాన లక్షణాలు.. ఎడతెరపి లేని దగ్గు (Cough), జ్వరం (Fever). దీంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు, వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని