Nuh: నూహ్‌లో మళ్లీ టెన్షన్‌ టెన్షన్‌.. సరిహద్దులు మూసేసిన పోలీసులు

నూహ్‌ (Nuh)లో సోమవారం శోభాయాత్ర నిర్వహించి తీరుతామని విశ్వహిందూ పరిషత్‌ తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా సరిహద్దులను మూసివేసి బయటవారిని అనుమతించట్లేదు.

Updated : 28 Aug 2023 10:15 IST

నూహ్‌: ఇటీవల అల్లర్లు చెలరేగిన హరియాణా (Haryana)లోని నూహ్‌ (Nuh) జిల్లాలో మరోసారి ద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు అనుమతి ఇవ్వనప్పటికీ హిందూ సంస్థలు సోమవారం శోభాయాత్ర  చేపట్టేందుకు సిద్ధమవుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నూహ్‌ వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్కూళ్లు, బ్యాంకులు మూసివేశారు. ప్రజలు గుమిగూడకుండా 144 సెక్షన్‌ విధించారు. మొబైల్‌ ఇంటర్నెట్‌, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ సేవలను నిలిపివేశారు.

శ్రావణమాసం చివరి సోమవారాన్ని (ఉత్తరాది ప్రకారం) పురస్కరించుకుని హిందూ సంస్థలు శోభాయాత్రకు పిలుపునిచ్చాయి. అయితే, సెప్టెంబరు 3-7 వరకు జీ20 షెర్పా గ్రూప్‌ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శోభాయాత్రకు అనుమతివ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ నేడు శోభాయాత్రను నిర్వహించి తీరుతామని విశ్వహిందూ పరిషత్‌ (VHP) తేల్చి చెప్పింది.

దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 30 కంపెనీల పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు. జిల్లా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. నూహ్‌ వ్యాప్తంగా ఎక్కడికక్కడ బారికేడ్లను పెట్టారు. బయటి జిల్లాల వారిని నూహ్‌లోకి అనుమతించడం లేదు. దూకాణాలు తెరవద్దని స్థానికులకు సూచించారు. సోమవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు.

చాట్‌జీపీటీ ఆధారంగా తీర్పులివ్వలేం: దిల్లీ హైకోర్టు

అయోధ్య సాధువుల అడ్డగింత..

నూహ్‌లోని నల్హత్‌ ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజల్లో పాల్గొనేందుకు అయోధ్య నుంచి కొంతమంది సాధువులు రాగా.. వారిని సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఆలయాల్లో పూజలు చేసుకోండి: సీఎం ఖట్టర్‌

భద్రతా కారణాల దృష్ట్యా శోభాయాత్రకు తాము అనుమతినివ్వలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. అయితే, ప్రజలు సమీపంలోని ఆలయాలకు వెళ్లి పూజలు చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు.

జులై 31వ తేదీన నూహ్‌లో విశ్వహిందూ పరిషత్‌ చేపట్టిన ర్యాలీపై దుండగులు జరిపిన మూకదాడి హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిగిన అల్లర్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుచి నూహ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని