సినిమా థియేటర్లలో 50% నిబంధన సడలింపు

కరోనా కట్టడే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను పొడిగించింది. నవంబర్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను పొడిగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు .....

Updated : 27 Jan 2021 20:35 IST

కొవిడ్‌ మార్గదర్శకాలు పొడిగించిన కేంద్రం

దిల్లీ: కరోనా వ్యాప్తిని మరింతగా కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను పొడిగించింది. నవంబర్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను పొడిగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్గదర్శకాలే ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు వర్తిస్తాయని స్పష్టంచేసింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుండటంతో మరిన్ని ఉపశమనాలు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా మార్గదర్శకాలు విడుదల చేశారు. 

* గతంలో 50శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చిన కేంద్రం.. ఈసారి అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో తెరుచుకోవచ్చని తెలిపింది. 

* కేవలం క్రీడాకారులే కాకుండా అందరూ స్విమ్మింగ్‌ పూల్స్‌కు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త మార్గదర్శకాలను ఆయా శాఖలు విడుదల చేస్తాయని పేర్కొంది.

* కంటైన్‌మెంట్‌ జోన్‌ల వెలుపలి అన్ని కార్యకలాపాలకూ అనుమతి

* కేవలం బిజినెస్‌ తరహానే కాకుండా అన్ని రకాల ఎగ్జిబిషన్‌ హాళ్లు తెరిచేందుకు కేంద్రం అనుమతించింది.

* అంతర్జాతీయ విమాన సర్వీసులపై పౌర విమానయాన శాఖ కేంద్రహోం శాఖతో పరిస్థితులపై సమీక్షించి నిర్ణయం

* సామాజిక/ఆధ్యాత్మిక/క్రీడా/ వినోద/విద్యా/సాంస్కృతిక సంబంధిత సభలు, సమావేశాలకు హాలు సామర్థ్యంలో 50శాతం (లేదా 200మంది మించరాదు) వరకు గతంలో అనుమతించిన కేంద్రం.. తాజాగా ఆ పరిమితిని సడలించింది. దీనిపై ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతికి అవకాశం కల్పించింది.

* ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలంటే ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు

65 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

దేశంలో గత నాలుగు నెలలుగా యాక్టివ్‌ కేసుల తగ్గినట్టు కేంద్రం పేర్కొంది. కంటైన్‌మెంట్‌ వ్యూహం కఠినంగా అమలుచేయడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిరంతరం నిఘా, పర్యవేక్షణ కొనసాగిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. మాస్క్‌లు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలను మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. 

ఇదీ చదవండి..

భారత్‌ : 97 శాతానికి చేరిన రికవరీ రేటు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని