Modi: తెమ్జెన్‌.. నీ మాటలు దేశమంతా వినిపిస్తున్నాయ్‌..!

నాగాలాండ్ మంత్రి తెమ్జెన్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేసే పోస్టులు అందరిని ఆకట్టుకుంటాయి. తాజాగా ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ(Modi) ఆ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం.

Published : 25 Feb 2023 00:25 IST

కోహిమా: తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రకృతి అందాలను వివరిస్తూ.. జీవిత సత్యాలను బోధిస్తూ.. ఇటీవల కాలంలో అందరి దృష్టిని ఆకర్షించారు తెమ్జెన్‌ ఇమ్నా అలోంగ్‌(Temjen Imna Along). తాజాగా ఆయనపై ప్రధాని మోదీ(Modi) ప్రశంసలు కురిపించారు. త్వరలో నాగాలాండ్‌(Nagaland)లో ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అక్కడ ప్రచారానికి వెళ్లిన ప్రధాని ఈ నాగాలాండ్‌ మంత్రి గురించి ప్రస్తావించగా.. సభ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది.

దిమాపుర్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడుతూ..‘మన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చెప్పిన విషయాలు దేశమంతా వినిపిస్తున్నాయి. వాటిని అంతా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆయన డిజిటల్ వేదికగా నాగాలాండ్‌, ఈశాన్య భారతాన్ని అందంగా పరిచయం చేస్తున్నారు. నేను ఆయన పెట్టిన ప్రతి పోస్టును చూసేందుకు ప్రయత్నిస్తుంటాను’  అని మెచ్చుకున్నారు. నాగాలాండ్(Nagaland) మంత్రిగా ఉన్న తెమ్జెన్‌.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. మోదీని ఆయన గురూజీ అని సంబోధిస్తారు. రాష్ట్రంలో ప్రధాని పర్యటన నేపథ్యంలో ఓ ట్వీట్ చేశారు. ‘గురూజీ ఈ రాష్ట్రానికి వస్తున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది’ అంటూ భాజపా జెండా కప్పుకొన్న తన చిత్రాన్ని షేర్ చేశారు. ‘ఎన్నికలున్నాయనే సాకుతో నచ్చింది ఆరగిస్తున్నా’ అంటూ ఇంతకుముందు ఓ ట్వీట్ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని