Punjab: డ్రగ్స్‌ స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం.. 5,500 మంది పోలీసులు.. 2వేల చోట్ల దాడులు!

డ్రగ్స్‌ (Drugs) అక్రమ రవాణాను అరికట్టేందుకు పంజాబ్‌ (Punjab) ప్రభుత్వం నడుం బింగించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 5500 మంది పోలీసులతో (Punjab Police) అనుమానితుల ఇళ్లలో ప్రత్యేక సోదాలు నిర్వహించింది. 

Published : 31 May 2023 22:54 IST

చండీగఢ్‌: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (Drugs) అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పంజాబ్‌ (Punjab) ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా డ్రగ్స్‌ అక్రమ రవాణాలో భాగస్వామ్యమైన వారిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపట్టింది. పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ ఆదేశాలతో ఆపరేషన్‌ చేపట్టిన పోలీసులు (Punjab Police)..  5500 మంది పోలీసులతో కూడిన 650 బృందాలు ఒకేసారి రాష్ట్రంలో 2247 చోట్ల సోదాలు చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. డ్రగ్ స్మగ్లింగ్‌తో సంబంధాలు ఉన్న వారి ఇళ్లు, ఇతర ప్రదేశాల్లో ఈ దాడులు జరిగాయని పోలీసులు వెల్లడించారు.

ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా అనుమానిత వ్యక్తుల ఇళ్లలో పూర్తి సోదాలు నిర్వహించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 48మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పలువురి బ్యాంకు ఖాతాల వివరాలు, విదేశాల నుంచి జరిగే లావాదేవీలను పరిశీలించారు. సోదాల్లో భాగంగా 1.8 కిలోల హెరాయిన్‌, ఇతర మత్తుపదార్థాలు, రూ.5.3లక్షల నగదు, నాలుగు ఆయుధాలతోపాటు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటితోపాటు 78 ఫోన్లను స్వాధీనం చేసుకొని వాటిని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపించామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని