Rahul Gandhi: బ్రిటన్‌ వ్యాఖ్యలపై పార్లమెంటరీ ప్యానెల్‌కు రాహుల్‌ గాంధీ వివరణ!

Rahul Gandhi: భారత ప్రజాస్వామ్యంపై లండన్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. శనివారం జరిగిన పార్లమెంటరీ ప్యానెల్‌ సమావేశంలో ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది.

Published : 19 Mar 2023 10:46 IST

దిల్లీ: భారత ప్రజాస్వామ్యంపై లండన్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది. ఆయన క్షమాపణలు చెప్పే వరకు ఊరుకునేది లేదని అధికార భాజపా తేల్చి చెప్పింది. దీనిపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. పార్లమెంటు సమావేశాలు సైతం ఎలాంటి చర్చ, కార్యకలాపాలు లేకుండానే వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ తన వ్యాఖ్యలపై శనివారం స్పష్టతనిచ్చినట్లు సమాచారం. విదేశాంగ మంత్రి జయశంకర్‌ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ ప్యానెల్‌ సమావేశంలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడినట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలని తాను ఏ దేశాన్ని ఆహ్వానించలేదని రాహుల్‌ (Rahul Gandhi) సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇది భారత అంతర్గత విషయమని.. దీన్ని అధికారంలో ఉన్న పార్టీయే పరిష్కరించాల్సిన అవసరం ఉందని తాను స్పష్టంగా చెప్పానని రాహుల్‌ సమావేశంలో వివరించినట్లు సమాచారం. తొలుత జీ20 అధ్యక్షతపై జయశంకర్‌ తన ప్రణాళికలను కమిటీకి వివరించారు. అది పూర్తయిన తర్వాత ఓ ఎంపీ మాట్లాడుతూ.. కొంత మంది మన దేశ ప్రజాస్వామ్యాన్ని విదేశీ గడ్డపై అవమానిస్తున్నారని అన్నట్లు తెలుస్తోంది. దీనికి స్పందిస్తూ రాహుల్‌ (Rahul Gandhi) సుదీర్ఘంగా తన వాదనను కమిటీ ముందు ఉంచినట్లు సమాచారం.

ఈ క్రమంలో అధికార, విపక్ష ఎంపీల మధ్య సమావేశంలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. రాహుల్‌ (Rahul Gandhi) వివరణ ఇవ్వడానికి ఇది సరైన వేదిక కాదని కొంతమంది భాజపా ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, అధికార పార్టీ ఎంపీలే ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు.. దానిపై క్లారిటీ ఇచ్చే హక్కు ప్యానెల్‌ సభ్యుడికి ఉంటుందంటూ విపక్ష ఎంపీలు రాహుల్‌కు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. ఈ క్రమంలో సభ్యులను నిలువరించిన జయశంకర్‌ కేవలం సమావేశ అజెండాపైనే మాట్లాడాలని కోరారట! ఈ విషయంపై ఏదైనా స్పష్టతనివ్వాలంటే.. పార్లమెంటులోనే మాట్లాడాలని సూచించారని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని