PM Modi: సౌదీ యువరాజుతో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ!

సౌదీ యువరాజు, ప్రధాని మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (Mohammed bin Salman)తో భేటీ అయిన మోదీ.. భారత్‌కు అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో ఆ దేశం ఒకటని అన్నారు.

Published : 11 Sep 2023 14:20 IST

దిల్లీ: ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థిరత్వం, సంక్షేమంలో భారత్‌-సౌదీ అరేబియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం (Strategic Partnership) ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. సౌదీ యువరాజు, ప్రధాని మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (Mohammed bin Salman)తో భేటీ సందర్భంగా మాట్లాడిన మోదీ.. భారత్‌కు అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరుదేశాలు కొత్త అంశాలతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయన్నారు.

దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో మోదీ, మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌లు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై విశ్లేషణ జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇరుదేశాల సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అనేక మార్గాలను అన్వేషించామన్నారు. ఇక సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మాట్లాడుతూ.. భారత్‌లో పర్యటించడం సంతోషంగా ఉందన్నారు. జీ20 సదస్సును నిర్వహించినందుకు భారత్‌ను అభినందిస్తున్నానని.. ఈ సదస్సు వల్ల యావత్‌ ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల గొప్ప భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని అన్నారు. కాగా.. భారత్‌లో మహ్మద్‌ బిన్‌ పర్యటించడం ఇది రెండోసారి.

G20 summit : గాంధీ, మోదీ.. భారత్‌కు చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తులు

భారత్‌కు వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా కీలక దేశంగా ఉంది. గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలతో ఇరుదేశాల సంబంధాలు ఉన్నతస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా రక్షణ, భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని 2019లో ప్రకటించారు. 2020 డిసెంబర్‌లో అప్పటి భారత చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ ఎంఎ నరవణె కూడా సౌదీ అరేబియాలో తొలిసారి పర్యటించారు. అనంతరం ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య రాకపోకలు సాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని