Jio: జియో నుంచి కొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌.. ₹399కే ఫ్యామిలీ ప్లాన్‌

Jio Plus Postpaid Plans: జియో కొత్త పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్లను లాంచ్‌ చేసింది. రెండు వ్యక్తిగత, రెండు ఫ్యామిలీ ప్లాన్లను తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇవీ..

Updated : 15 Mar 2023 03:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio).. జియో ప్లస్‌ స్కీమ్‌ కింద కొత్త పోస్ట్‌పెయిడ్‌ (Postpaid) ప్లాన్లను తీసుకొచ్చింది. రెండు వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు, రెండు ఫ్యామిలీ ప్లాన్లను లాంచ్‌ చేసింది. ఇందులో అపరిమిత కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లతో పాటు, ఒక నెల ఫ్రీ ట్రెయిల్‌ లభిస్తుంది. మార్చి 22 నుంచి కొత్త ప్లాన్లు అందుబాటులో ఉంటాయని జియో తెలిపింది.

ఫ్యామిలీ ప్లాన్లు..

రూ.399 జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో ఉచిత కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లు, 75 జీబీ డేటా లభిస్తుంది. ముగ్గురు ఫ్యామిలీ మెంబర్లను ఇందులో యాడ్‌ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ కోసం రూ.500 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. జియో తీసుకొచ్చిన మరో ప్లాన్‌ రూ.699. ఈ ప్లాన్‌లో 100 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్‌, ఎస్సెమ్మెస్‌ లభిస్తాయి. ముగ్గురు ఫ్యామిలీ మెంబర్లను యాడ్‌ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో అదనంగా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఓటీటీ సర్వీసులు ఉచితంగా పొందొచ్చు. ఈ ప్యాక్‌కు రూ.875 సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ కింద తీసుకొనే ఒక్కో నంబర్‌పై అదనంగా రూ.99లు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు A అనే వ్యక్తి రూ. 399 ప్లాన్‌ తీసుకుని B,C అనే మరో ఇద్దరు వ్యక్తులను యాడ్‌ చేసుకోవాలంటే Bకి రూ. 99, Cకి మరో రూ.99 చెల్లించాలి. దీంతో మొత్తంగా ఈ ప్లాన్‌కి రూ. 399తోపాటు అదనంగా రూ. 198 చెల్లించాలి.

వ్యక్తిగత ప్లాన్లు

జియో వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు రూ.299 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ప్లాన్‌లో 30జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ కింద రూ.375 డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీట్రెయిల్‌ సదుపాయం లేదు. జియో అందిస్తున్న మరో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ రూ.599. ఈ ప్లాన్‌ కింద అపరిమిత కాల్స్‌,  అన్‌లిమిటెడ్‌ డేటా, అన్‌లిమిటెడ్‌ ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ కింద రూ.750 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. జియో ఫైబర్‌, కార్పొరేట్‌ ఉద్యోగులు, క్రెడిట్‌ కార్డు కస్టమర్లు, మంచి క్రెడిట్‌ స్కోరు కలిగిన వారికి సెక్యూరిటీ డిపాజిట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది.

జియో పోస్ట్‌ పెయిడ్‌ కనెక్షన్‌ కావాల్సిన వారు 70000 70000 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్‌పెయిడ్‌ సిమ్‌ హోమ్‌ డెలివరీ ఆప్షన్‌ కూడా ఉంది. హోమ్‌ డెలివరీ సమయంలో కుటుంబ సభ్యుల సిమ్‌ కార్డులను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఒక్కో సిమ్‌ కార్డు యాక్టివేషన్‌కు రూ. 99 చెల్లించాలి. ఒకసారి మెయిన్‌ సిమ్‌ యాక్టివేట్‌ అయ్యాక మిగిలిన మూడు సిమ్‌లను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే జియో ప్రీపెయిడ్‌ కస్టమర్‌ అయి ఉంటే సిమ్‌ కార్డు మార్చకుండానే మై జియో యాప్‌ ద్వారా ప్రీపెయిడ్‌ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు మారొచ్చు. ఓటీపీ వెరిఫికేషన్‌ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు