Ranbir Kapoor AliaBhatt: ఆలియా-రణ్‌బీర్‌ పెళ్లి పనులు షురూ.. ఈరోజే ఎంగేజ్‌మెంట్‌..!

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు ఆలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ మరికొన్ని గంటల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ‘బ్రహ్మాస్త్ర’తో ఒక్కటైన ఈ జంట.. ఇప్పటికే ఎన్నోసార్లు తమ అనుబంధం గురించి అధికారికంగా ప్రకటించేశారు....

Published : 13 Apr 2022 15:13 IST

ముంబయి: బాలీవుడ్‌ ప్రేమ పక్షులు ఆలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ మరికొన్ని గంటల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ‘బ్రహ్మాస్త్ర’తో ప్రేమికులుగా మారిన ఈ జంట.. ఇప్పటికే ఎన్నోసార్లు తమ అనుబంధం గురించి అధికారికంగా ప్రకటించేశారు. దీంతో వీరి పెళ్లి కోసం అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో రణ్‌బీర్‌-ఆలియా ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. ముంబయిలోని వాస్తు అపార్ట్‌మెంట్‌లోని రణ్‌బీర్‌-ఆలియా నివాసం పెళ్లికి వేదికైంది.

ఈరోజే ఎంగేజ్‌మెంట్‌..!

రణ్‌బీర్‌-ఆలియా పెళ్లి వార్తతో బాలీవుడ్‌లో సందడి వాతావరణం నెలకొంది. కపూర్‌, మహేశ్‌భట్‌ కుటుంబసభ్యుల సమక్షంలో జరగనున్న ఈ పెళ్లి వేడుకల్లో అత్యంత సన్నిహితులు, ఇండస్ట్రీ నుంచి కొద్దిమంది మిత్రులు మాత్రమే హాజరు కానున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా గణపతి పూజను బుధవారం ఉదయం వాస్తు అపార్ట్‌మెంట్‌లో నిర్వహించారు. ఈ వేడుకల్లో రణ్‌బీర్‌ తల్లి నీతూకపూర్‌, సోదరి, బంధువులు పాల్గొన్నారు. సాయంత్రం రణ్‌బీర్‌-ఆలియా నిశ్చితార్థం, ఆ తర్వాత మెహందీ వేడుక జరగనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి రేపు మధ్యాహ్నం జరగనుందని తెలుస్తోంది.

కాంతులీనుతోన్న ఆర్కే స్టూడియో, నివాసాలు..!

ఆలియా-రణ్‌బీర్‌ పెళ్లి కపూర్‌ కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపింది. వీరి పెళ్లి సందర్భంగా ముంబయిలోని ఆర్కే స్టూడియో, వాస్తు అపార్ట్‌మెంట్‌, కపూర్‌ కుటుంబానికి చెందిన కృష్ణరాజ్‌ బంగ్లా.. ఇలా అన్నీ కూడా విద్యుదీపాలతో కాంతులీనుతున్నాయి.

కెమెరాలకు రెడ్‌కలర్‌ స్టిక్కర్లు..!

పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్నీ వధూవరుల కుటుంబసభ్యులు దగ్గరుండి చూసుకుంటున్నారట. తమ జీవితాల్లో ఎంతో ముఖ్యమైన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు లీక్‌ కాకుండా ఉండేందుకు ఆలియా-రణ్‌బీర్‌ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇందులో భాగంగా పెళ్లి వేడుకల్లో విధులు నిర్వర్తించనున్న స్టాఫ్‌ సెల్‌ఫోన్ల కెమెరాలకు ఎరుపు రంగు స్టిక్కర్లు అతికించారని, ఫంక్షన్‌ నుంచి బయటకు వచ్చే వరకూ వాటిని ఎవరూ తీయకూడదని వాళ్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని