kollywood: పాదయాత్ర ప్రారంభించనున్న స్టార్‌ హీరో విజయ్‌ ..!

స్టార్‌ హీరో విజయ్‌ (Thalapathy Vijay) త్వరలోనే పాదయాత్ర ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Updated : 12 Jul 2023 12:24 IST

చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ (Thalapathy Vijay) పాదయాత్రకు సన్నద్ధం అవుతోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ ఈ న్యూస్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. గతకొన్ని రోజులుగా విజయ్‌ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో పాదయాత్ర చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కొన్ని జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.

ఇటీవల కాలంలో ఈ హీరో  ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ (VMI) అభిమాన సంఘం సభ్యులతో తరచూ భేటీ అవుతున్నారు. ఈ మేరకు నిన్న కూడా వారితో ఓ సమావేశం ఏర్పాటు చేశారట. అందులోనే పాదయాత్రపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నటించిన తాజా చిత్రం ‘లియో’ విడుదల కంటే ముందే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. లియో చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈలోపు విజయ్‌ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.

ఇక ఇటీవల విజయ్ తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టెన్త్‌, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. చెన్నై వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో.. విద్యార్థులకు సర్టిఫికేట్స్‌, నగదు ప్రోత్సాహం అందించి అభినందించారు. ఇవ్వన్నీ చూస్తుంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖాయమనే అనిపిస్తోందంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇక నిన్న జరిగిన ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ మీటింగ్‌కు వెళ్లే సమయంలో విజయ్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆయనకు రూ.500 జరిమానా విధించారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్‌ ‘లియో’ (Leo)లో నటించారు. ఇటీవలే దీని చిత్రీకరణ పూర్తయింది. దీని తర్వాత వెంకట్‌ ప్రభుతో ఓ సినిమాను ఓకే చేశారు. అలాగే తాజాగా దర్శకుడు శంకర్‌తో ఓ మూవీ చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రానున్న ఎన్నికల్లో ఆయన పోటీచేయనున్నారనే వార్తలు కూడా జోరుగా ప్రచారమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు