Unni Mukundan: సమాజం ఎటు వెళ్తుందో చూపించాం

‘‘సరోగసీ (అద్దె గర్భం) అనేది చెప్పడానికి సులభంగా ఉంటుంది కానీ అదొక భావోద్వేగ ప్రయాణం. తేలికగా దానిపై వ్యాఖ్యలు చేయకూడదు. శాస్త్రీయంగా చూస్తే.. అదొక అద్భుతం. పురాణాల్లోనూ మనం ఇటువంటి వాటి గురించి విన్నాం.

Updated : 07 Dec 2022 16:13 IST

‘‘సరోగసీ (అద్దె గర్భం) అనేది చెప్పడానికి సులభంగా ఉంటుంది కానీ అదొక భావోద్వేగ ప్రయాణం. తేలికగా దానిపై వ్యాఖ్యలు చేయకూడదు. శాస్త్రీయంగా చూస్తే.. అదొక అద్భుతం. పురాణాల్లోనూ మనం ఇటువంటి వాటి గురించి విన్నాం. చట్ట ప్రకారం అద్దె గర్భాన్ని ఆశ్రయించినప్పుడు ఎవరికీ ఎలాంటి సమస్య ఉండద’’న్నారు నటుడు ఉన్ని ముకుందన్‌ (Unni Mukundan). ‘జనతా గ్యారేజ్‌, ‘భాగమతి’ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. ఇప్పుడు ‘యశోద’ (Yashoda)తో అలరించేందుకు సిద్ధమయ్యారు. సమంత (Samantha) టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రమిది. హరి - హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా నవంబరు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఉన్ని ముకుందన్‌ విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

‘‘భవిష్యత్తు ప్రధానంగా సాగే చిత్రమిది. రానున్న రోజుల్లో మన సమాజం ఎటు వెళ్తుందనేది చూపిస్తున్నాం. త్వరలో అది వాస్తవ రూపంలోకి మారుతుందని నమ్మకం. తెలుగులో నేనిప్పటి వరకు మూడు చిత్రాలు చేశా. ప్రతి దాంట్లోనూ మంచి పాత్రలే చేశా. అవన్నీ విజయవంతమయ్యాయి. ఇప్పుడీ ‘యశోద’లోనూ ఓ మంచి పాత్రే చేశా. అదేంటన్నది ప్రస్తుతానికి చెప్పలేను. తెరపై చూస్తేనే బాగుంటుంది. నేనైతే ఒక్క మాట చెప్పగలను. మంచి సినిమా తీశాం. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నాం’’.

* ‘‘నటుడిగా కొత్తదనం చూపించడమంటే ఇష్టం. ఏ సినిమా చేయాలన్నా.. కథ ఎలా ఉంది, అందులో నా పాత్ర ఏంటి, ఆ పాత్రలో నేను ఎంత చేయగలను? అని ఆలోచించుకునే రంగంలోకి దిగుతా. నటుడిగా రిహార్సల్స్‌ ఇవ్వడానికి నేను కొంచెం ఆలోచిస్తా. సెట్లో ఇతర నటులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని చూస్తా. ఏం చేసినా నేరుగా కెమెరా ముందే చేసి చూపిస్తా. అప్పుడు తోటి నటుల నటన సహజంగా ఉంటుంది. ప్రస్తుతం మలయాళంలో రెండు సినిమాలు చేస్తున్నా. ‘మాలికాపురం’ అనే చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నాం’’.

*  ‘‘ఈ చిత్రం కోసం సమంత చాలా కష్టపడింది. పోరాటాలు, భావోద్వేగ సన్నివేశాలు చేశారు. సామ్‌తో కలిసి పని చేస్తున్నప్పుడు తను మయోసైటిస్‌తో బాధ పడుతున్నట్లు తెలియదు. సెట్లో తన పని విషయంలో చాలా పక్కాగా ఉంటారామె. తను ఇలాంటి వ్యాధితో పోరాటం చేస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. ఇన్‌స్టాలో ఆమె పోస్ట్‌ చూసి బాధపడ్డా. త్వరలో ఆమె పూర్తి ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని