
అళగిరిని భాజపాలోకి తీసుకొస్తా!
కమల దళంలోకి డీఎంకే మాజీ ఎంపీ రామలింగం
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరగనున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డీఎంకే బహిష్కృత నేత, మాజీ ఎంపీ కేపీ రామలింగం శనివారం భాజపాలో చేరారు. కరుణానిధి తనయుడు ఎంకే అళగిరికి సన్నిహితుడిగా పేరున్న రామలింగం.. భాజపా రాష్ట్ర ఇన్ఛార్జి సీటీ రవి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్ సమక్షంలో కాషాయ జెండా కప్పుకొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సోదరుడైన ఎంకే అళగిరిని భాజపాలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని వ్యాఖ్యానించారు. ఆయనతో తనకు సన్నిహిత సంబంధం ఉందని తెలిపారు. అళగిరికి తాను సోదరుడిలాంటి వాణ్ని అన్నారు. తమిళనాడులో భాజపా నిర్మాణానికి కృషిచేస్తానని చెప్పారు. 30 ఏళ్ల క్రితం తాను డీఎంకేలో చేరినప్పుడు ఆ పార్టీ ఎదురుదెబ్బ తిన్నప్పటికీ.. పార్టీ నిర్మాణం కోసం పనిచేసినట్టు గుర్తు చేసుకున్నారు. రామలింగం 1996లో డీఎంకే నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం 2010లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అంతకముందు అన్నాడీఎంకే నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
కరోనా సమస్యపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా మాట్లాడటంతో మార్చి నెలలో రామలింగాన్ని పార్టీ నుంచి బహిష్కరించారు.