BJP: విపక్షాల లేఖాస్త్రం.. కౌంటర్‌గా భాజపా మీడియా అస్త్రం!

ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు భాజపా మీడియాను అస్త్రంగా ఉపయోగించేందుకు సమాయత్తమవుతోంది. 9 రాష్ట్రాల్లో ఒకే రోజు మీడియా సమావేశాలు నిర్వహించి ప్రతిపక్షాల లేఖాస్త్రానికి బదులివ్వాలని నిర్ణయించింది.

Published : 10 Mar 2023 01:31 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam)లో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి సిసోదియా (Manish Sisodia) ను సీబీఐ (CBI) అరెస్టు చేయడంపై విపక్షాలు రాసిన లేఖకు దీటుగా బదులిచ్చేందుకు అధికార భాజపా సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఆదివారం ఒకే రోజు మీడియా సమావేశాలు నిర్వహించి ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు సమాయత్తమవుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అధికార భాజపా పావుగా వాడుకుంటోందని, ప్రతిపక్షనాయకులపై వాటిని ప్రయోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఇటీవల భారాస (BRS), తృణమూల్‌ (Trinamool), ఆమ్‌ఆద్మీ (APP) తదితర 9 పార్టీలు ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా మారుతాయని లేఖలో పేర్కొన్నారు. దీనిపై తమ వైఖరిని తెలియజేసేందుకు... ప్రధాని మోదీకి లేఖలు రాసిన రాష్ట్రాల్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించాలని భాజపా నిర్ణయించింది.

దిల్లీ, పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌, మహారాష్ట్ర, పశ్చిమ్‌బెంగాల్‌, కేరళ రాష్ట్రాల్లో ఒకే రోజు భాజపా మీడియా సమావేశాలు నిర్వహించనుంది. అవినీతి భయంతోనే ఈ లేఖలు రాశారంటూ ప్రజలకు చెప్పేందుకే భాజపా ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఏయే రాష్ట్రాల్లో ఎవరెవరు మీడియా సమావేశాలు నిర్వహించాలన్న దానిపై పార్టీ అధిష్ఠానం ఓ జాబితాను సిద్ధం చేసింది. రాజధాని దిల్లీలో ఎంపీ మనోజ్‌ తివారీ మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. పశ్చిమ్‌బెంగాల్‌లో సువేందు అధికారి, బిహార్‌లో సంజయ్‌ జైశ్వాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో బ్రిజేశ్‌ పాథక్‌, తెలంగాణలో బండి సంజయ్‌ సమావేశాలను నిర్వహించనున్నారు.

సరైన ఆధారాలు లేకుండా సిసోదియాను అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని విపక్ష నేతలు లేఖలో పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే ఆయన్ని అరెస్టు చేశారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.2014లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుల్లో అత్యధికం భాజపాయేతర పార్టీలకు చెందినవారేనని లేఖలో విపక్ష నాయకులు పేర్కొన్నారు. భాజపాలో చేరిన ప్రతిపక్ష నాయకులపై మాత్రం దర్యాప్తు వేగం నెమ్మదించిందని తెలిపారు. అందుకు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై నమోదైన కేసులను లేఖలో ఉటంకించారు. దీన్ని బట్టి దర్యాప్తు సంస్థల విచారణలు పూర్తిగా రాజకీయ ఉద్దేశపూరితమైనవిగా స్పష్టమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో భాజపా ఓకే రోజు 9 రాష్ట్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని