‘రామ్‌మందిర్‌ ట్రస్ట్‌ అవినీతిపై విచారణ జరపాలి’

అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం భక్తుల నుంచి పెద్దఎత్తున విరాళాలు సేకరించిన రామ మందిర తీర్థ్‌ ట్రస్ట్‌ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. దీనిప...

Published : 15 Jun 2021 01:06 IST

దిల్లీ: అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం భక్తుల నుంచి పెద్దఎత్తున విరాళాలు సేకరించిన రామ మందిర తీర్థ్‌ ట్రస్ట్‌ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా మీడియాతో మాట్లాడారు.

ఈ ఏడాది మార్చి 18న 12080 చదరపు మీటర్ల భూమిని ట్రస్ట్‌ రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసిందని, అంతకు కొద్ది నిమిషాల ముందే రూ.2 కోట్లకు ఆ భూమిని రవి తివారీ, సుల్తాన్‌ అన్సారీ అనే వ్యక్తులు కొనుగోలు చేశారని సూర్జేవాలా అన్నారు. వారి నుంచి ట్రస్ట్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించాలని కోరారు. అలాగే మందిర నిర్మాణానికి వచ్చిన విరాళాలపై కూడా ఆడిట్‌కు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రామ మందిర పనులు శరవేగంగా సాగుతున్నాయని, వాటిని యథాతథంగా కొనసాగించాలని చెప్పారు.

అపఖ్యాతి పాల్జేయడానికి చూస్తున్నారు

రామ జన్మభూమికి అపఖ్యాతి తెచ్చేందుకు వచ్చే ఏ అవకాశాన్ని కూడా కొందరు వదులుకోరని ఉత్తర్‌ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ అన్నారు. ట్రస్ట్‌ అవినీతికి పాల్పడిందంటూ ఆప్‌, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. రాముడు ఓ కల్పిత పాత్ర అని, రామ సేతు లేదని చెప్పేవారే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని