ఆ గట్టునుంటావా దిల్లీ ఓటరా.. ఈ గట్టుకొస్తావా

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచార వేగం పెంచాయి. గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తమ వాగ్ధాటితో ప్రత్యర్థి పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి

Published : 21 Jan 2020 15:10 IST

కేజ్రీవాల్‌, మనోజ్‌ తివారీ ట్విటర్ వార్‌

దిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచార వేగం పెంచాయి. గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తమ వాగ్ధాటితో ప్రత్యర్థి పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, భాజపా ఎంపీ మనోజ్‌ తివారీ ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధానికి దిగారు. ‘‘ఆ వైపునుంటారా లేదా అభివృద్ధి జరిపించే మావైపున ఉంటారా’’ అని పరస్పరం విమర్శించుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ మంగళవారం ఉదయం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘ఓ వైపు - భాజపా, జేడీయూ, ఎల్‌జేపీ, జేజేపీ, కాంగ్రెస్‌, ఆర్జేడీ.. మరోవైపు - స్కూల్‌, హాస్పిటల్‌, నీరు, విద్యుత్‌, మహిళలకు ఉచిత రవాణా, దిల్లీ ప్రజలు.. నా లక్ష్యం - అవినీతిని ఓడించడం, దిల్లీని ముందుకు తీసుకెళ్లడం.. వారందరి ఏకైక లక్ష్యం - నన్ను ఓడించడం’ అని సీఎం విమర్శలు చేశారు. 

కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేసిన కేవలం 30 నిమిషాల్లోపే భాజపా దిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ సీఎంకు కౌంటర్‌ ఇస్తూ ట్వీట్ చేశారు. ‘ఓ వైపు - దెబ్బతిన్న రోడ్లు, కలుషితమైన, విషపూరితమైన నీరు, ఒక్క కొత్త స్కూల్‌, కొత్త ఆసుపత్రి లేదు. హాస్పిటళ్లలో ఆపరేషన్‌ థియేటర్లు మూతబడ్డాయి. ఒక్క విద్యుత్‌ బస్సు కూడా లేదు. అవినీతిపై పోరాడుతున్న నేతలను పార్టీ నుంచి తొలగించింది. మహాకూటమితో కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. మొత్తానికి 70 నియోజకవర్గాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విఫలమైంది. 
మరోవైపు - భాజపా అందరితో కలిసి అందరి అభివృద్ధి కోసం పనిచేస్తోంది’ అని తివారీ ఆప్‌ సర్కార్‌ను దుయ్యబట్టారు. దిల్లీ ప్రజలు భాజపాతోనే ఉంటారని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా పరస్పర విమర్శలతో ‘ఆ పార్టీకి ఓటేస్తారో.. లేదా మా పార్టీకి ఓటేస్తారో మీరే తేల్చుకోండి’ అంటూ పరోక్షంగా దిల్లీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని