మహిళా పక్షపాతి... తెలుగుదేశం పార్టీ

తెదేపా ఆవిర్భావం నుంచి మహిళలకు అగ్రపీఠం వేస్తోంది. దివంగత మహానేత నందమూరి తారకరామారావు తెలుగింటి ఆడపడుచులకు ఎనలేని గౌరవం ఇచ్చేవారు.

Updated : 28 May 2023 06:57 IST

పి.గన్నవరం, గోపాలపురం, న్యూస్‌టుడే: తెదేపా ఆవిర్భావం నుంచి మహిళలకు అగ్రపీఠం వేస్తోంది. దివంగత మహానేత నందమూరి తారకరామారావు తెలుగింటి ఆడపడుచులకు ఎనలేని గౌరవం ఇచ్చేవారు. అదే ఒరవడిని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారు. తెదేపా ఆవిర్భావం నుంచే రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యం పెరిగింది. డ్వాక్వా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా తీర్చిదిద్దిన ఘనత తెదేపాకు దక్కుతుంది. స్థానిక సంస్థల్లో మహిళలకు వివిధ పదవులు వస్తున్నాయంటే అది తెదేపా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని మహానాడు సందర్భంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వనితలు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.


ఎన్టీఆర్‌తో ఎనలేని అనుబంధం

నాకు ఎన్టీఆర్‌తో ఎనలేని అనుబంధం ఉండేది. హైదరాబాద్‌లో తెదేపా శిక్షణ తరగతులు మొదలుకుని అనేక కార్యక్రమాలకు హాజరయ్యా. ఎన్టీఆర్‌ చెల్లమ్మా అంటూ ఆప్యాయతతో పలకరించేవారు. నేను ఇంతవరకు సుమారు 35 మహానాడు సభలకు హాజరయ్యా.

మద్దుల మోహన, తెదేపా నాయకురాలు, మానేపల్లి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా


36 మహానాడు సభలకు హాజరయ్యా

నా వయస్సు 64 సంవత్సరాలు. ఇంతవరకు 36 మహానాడు సభలకు హాజరయ్యా. నేను విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా మహిళా విభాగం అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. రాష్ట్రంలో జగన్‌ రాక్షస పాలన సాగిస్తున్నారు. ఈ ప్రభుత్వం కుప్పకూలటం తథ్యం. ఇందుకు మహానాడుకు ఉవ్వెత్తున తరలివచ్చిన జనమే నిదర్శనం. నేను ఈ వయసులో కూడా తెదేపాలో కీలక బాధ్యత నిర్వహిస్తున్నా.

మఠం ప్రమీలారావు, విశాఖపట్నం


700 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చా...

నాది అనంతపురం జిల్లా ఉరవకొండ. 700 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చా. పేదలకు కిలో రెండు రూపాయిల బియ్యం పథకాన్ని అమలు చేసిన ఘనత ఎన్టీఆర్‌దే. పేదలకు కూడు, గూడు, నీడ కల్పించింది ఆ మహానుభావుడే. పురుషులతోపాటు మహిళలకు సమాన హక్కు కల్పించిన పార్టీ తెదేపా.

బి.శాంతమ్మ, ఉరవకొండ, అనంతపురం జిల్లా


అన్నగారి ఆశయాలను కొనసాగిస్తున్నారు...

ఎన్టీఆర్‌ ఆశయాలను తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పథకాలు అమలు చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది అబద్ధం. తెదేపా పథకాలు నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి.

డి.విజయకుమారి, విశాఖ జిల్లా


బ్రాహ్మణ కార్పొరేషన్‌ పెట్టింది చంద్రబాబు...

పేద బ్రాహ్మణులను ఆదుకునే విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ పెట్టిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుదే. వైకాపా ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసింది. తెదేపా ప్రభుత్వం ఊతమిస్తే దానిని వైకాపా ప్రభుత్వం తొలగించింది. వచ్చేది తెదేపా ప్రభుత్వమే.

బి.నాగలక్ష్మి, తిరుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ సభ్యురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని