YS Sharmila: కాంగ్రెస్‌ నేతల గృహనిర్బంధం.. పార్టీ కార్యాలయంలోనే షర్మిల

‘చలో సెక్రటేరియట్‌’కు పిలుపునివ్వడంతో కాంగ్రెస్‌ పార్టీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు.

Updated : 21 Feb 2024 22:45 IST

విజయవాడ: దగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 22న చలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం సాయంత్రం విజయవాడ చేరుకున్నారు. బాపులపాడు మండలం అంపాపురంలోని కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఆమె బస చేయాల్సి ఉండగా.. ముందస్తు అరెస్టుల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండిపోయారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేసి గురువారం ఉదయం ‘చలో సెక్రటేరియట్‌’కు బయలుదేరి వెళ్లనున్నారు.

గృహనిర్బంధాలపై షర్మిల ‘ఎక్స్‌’(ట్విటర్‌) వేదికగా స్పందించారు. ‘‘నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌస్‌ అరెస్టులు చేయాలని చూస్తారా? వేలాదిగా తరలివస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా? నేను ఒక మహిళనై ఉండి హౌస్‌ అరెస్టు కాకుండా ఉండేందుకు.. పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గడపాల్సిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా? మేము తీవ్రవాదులమా?.. లేక సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే.. భయపడుతున్నట్లే కదా! ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా, బారికేడ్లతో బంధించాలని చూసినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు’’ అని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని