Nadendla manohar: జగనన్న విద్యా కానుకలో భారీ స్కామ్‌: నాదెండ్ల మనోహర్‌ ఆరోపణ

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని, అందులోనూ కుంభకోణం చోటుచేసుకుందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

Updated : 14 Nov 2023 17:23 IST

విజయవాడ: ఏపీలో జగనన్న విద్యా కానుకలో భారీ స్కామ్‌ జరిగిందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. నిధులను మళ్లించి నాడు-నేడు పేరిట ప్రజల్ని మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని, అందులో కుంభకోణం జరిగిందన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మనోహర్‌ మాట్లాడారు. ‘‘గత ఏడాది రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్‌ కొనుగోలు చేశారు. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారు. ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి రూ.2400 కోట్లు ఖర్చు చేశారు. టెండర్‌ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడ్డాయి. నిధులు దారి మళ్లినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో తేలింది. విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగింది’’ అని నాదెండ్ల ఆరోపించారు.

అద్భుతంగా తీర్చిదిద్దామని గొప్పలు చెబుతున్నారు..

‘విద్యార్థులకు ఆంగ్లం నేర్పేందుకు 32వేల ఫ్లాట్‌ ప్యానెల్స్‌ సరఫరా చేస్తామన్నారు. గతేడాది రూ.300 కోట్లతో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్స్‌ ప్యానెల్‌ కొనుగోలు చేశారు. గతేడాది ఫ్లాట్‌ ప్యానెల్స్‌కు సంబంధించి నేటికీ డబ్బులు ఇవ్వలేదు. రూ.400 కోట్లతో ఫ్లాట్‌ ప్యానెల్స్‌ కొనుగోలు పేరిట మరో కుంభకోణం జరిగింది. పాఠశాల వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దారని గొప్పలు చెబుతున్నారు. పాఠశాల వ్యవస్థకు రూ.16వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. నాడు-నేడు కార్యక్రమానికి నాబార్డు నుంచి రూ.1800 కోట్లు రుణం తెచ్చారు. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.700 కోట్లు రుణం తీసుకొచ్చారు’’ అని నాదెండ్ల తెలిపారు.

నిధుల మళ్లింపు కేంద్రం స్పందించాలి

‘‘రాష్ట్రంలో వైకాపా పాలనలో అవినీతిని ఆధారాలతో నిరూపిస్తున్నాం. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయం. అవినీతిపై విచారణ జరిపి సీఎం జగన్‌ చర్యలు తీసుకోవాలి. టోఫెల్‌, పాలవెల్లువ పథకంలో అవినీతిని జనసేన బయటపెట్టింది. విద్యాశాఖలో జరిగిన అవినీతిని బయటకు తెస్తున్నాం. జగనన్న విద్యాకానుక పేరుతో ప్రవేశపెట్టిన కిట్స్‌లోనూ అవినీతి జరిగింది. దిల్లీలో ఐదు కంపెనీలపై ఈడీ దాడులు చేసింది. ఆ కంపెనీలే విద్యా కానుక కిట్లు సరఫరా చేస్తున్నాయి. టెండర్లు ఆ ఐదు కంపెనీలకే ఎందుకిచ్చారు? గ్లోబల్‌ విద్యార్థులను తయారు చేస్తామని మోసం చేశారు. నాడు-నేడులో రూ.16వేల కోట్లు ఖర్చు చేశామంటున్నారు. రూ.6వేల కోట్లు గ్రాంట్లు వస్తే రూ.3,550 కోట్లే ఖర్చు చేశారు. మిగిలిన డబ్బును దారి మళ్లించారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఖర్చు చేయలేదు. వంటశాలలు, ప్రహరీ గోడలు నిర్మించకుండా దగా చేశారు. నిధుల మళ్లింపుపై కేంద్రం వెంటనే స్పందించాలి’’ అని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు