Sanjay Raut: ‘15- 20 రోజుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది..!’

ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రానున్న 15- 20 రోజుల్లో కూలిపోతుందని శివసేన ఉద్ధవ్‌ వర్గం నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు.

Published : 23 Apr 2023 16:37 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. అజిత్‌ పవార్‌ (Ajit Pawar) తన మద్దతుదారులతో కలిసి భాజపా (BJP)లో చేరతారనే ఊహాగానాలకు తోడు.. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడే చేపట్టాలనుందంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శివసేన (యూబీటీ) (Shivsena UBT) నేత సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. రానున్న 15- 20 రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు.

ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన 16 మంది శివసేన ఎమ్మెల్యేల(ప్రస్తుతం శిందే వర్గం)పై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌తో సహా అనేక పిటిషన్లపై పెండింగ్‌లో ఉన్న సుప్రీం కోర్టు తీర్పును సంజయ్‌ రౌత్‌ ప్రస్తావించారు. తమ పార్టీ కోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తోందని, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన 40 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం 15- 20 రోజుల్లో కూలిపోతుంది. ఈ మేరకు ఇప్పటికే ‘డెత్‌ వారెంట్‌’ జారీ అయింది’ అని రౌత్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. గత ఏడాది జూన్‌లో శిందేతోపాటు 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో పార్టీలో చీలిక ఏర్పడింది. ఫలితంగా ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. తదనంతరం భాజపాతో కలిసి ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు.. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం పిటిషన్‌ దాఖలు చేసింది. ఇటు శిందే వర్గం క్రాస్ పిటిషన్‌ వేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గత నెలలో తన తీర్పును రిజర్వ్ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని