Niranjanreddy: రఘునందన్‌రావు వస్తే.. దగ్గరుండి సర్వే చేయిస్తా: మంత్రి నిరంజన్‌రెడ్డి

భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన ఆరోపణలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను కొన్న భూమి కంటే గుంటభూమి ఎక్కువ ఉన్నా ఏ చర్యకైనా సిద్ధమన్నారు. ఆరోపణలు తప్పని రుజువైతే రఘునందన్‌ ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated : 23 Apr 2023 16:52 IST

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 160 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న ఫాంహౌస్‌లో ప్రభుత్వ, ఆర్డీఎస్‌ కోసం సేకరించిన భూములు ఉన్నాయని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన ఆరోపణలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆధారాల్లేకుండా తనపై అభాండాలు మోపడం సరికాదని మండిపడ్డారు. సాక్ష్యాధారాలుంటే చూపించాలని సవాల్‌ విసిరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. కావాలంటే ఎప్పుడైనా తన భూమి వద్దకు వచ్చి చూడొచ్చన్నారు. తనపై చేసిన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘‘పూర్తి పరిజ్ఞానం లేకుండా రఘునందన్‌రావు మాట్లాడారు. ఆర్డీఎస్‌ కాలువ, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. నాకు, నా కుటుంబానికి భూములు ఉన్న ప్రాంతంలో అసలు ఆర్డీఎస్‌ భూములే లేవు. రఘునందన్‌ చెప్పిన సర్వే నంబర్‌.60లో మాకు 3 ఎకరాల భూమి మాత్రమే ఉంది. రఘునందన్‌రావు వస్తే ఆయన ముందే సర్వే జరిపిస్తాం. మేం కొన్న భూమి కంటే గుంటభూమి ఎక్కువ ఉన్నా ఏ చర్యకైనా సిద్ధం. రఘునందన్‌రావు ఆరోపణలు తప్పని రుజువైతే ఆయన ఏం చేస్తారో చెప్పాలి?’’ అని నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని